ప్రతిరోజూ ఓ బాటిల్ ఆల్కహాల్, 60 సిగరెట్లు తాగినా క్యాన్సర్ రాదు: బీజేపీ ఎంపీ
ముంబై: ధూమపానం క్యాన్సర్కు కారణం కాదంటూ మరో బేజీపే ఎంపీ అన్నారు. అంతే కాదు ధూమపానం క్యాన్సర్కు కారణమవుతుందని అనేవారు తాను చెప్పే మాటలను పరిగణనలోకి తీసుకోవాలని అస్సాంకు చెందిన బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ అంటున్నారు.
జాతీయ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ ధూమపానం క్యాన్సర్కు కారణమవుతుందని ఎలాంటి ఆధారం లేదంటూ ఉదాహరణలు చెప్పారు. "ప్రతిరోజు ఓ బాటిల్ ఆల్కహాల్, 60 సిగరెట్లు తాగే ఇద్దరు వ్యక్తులు నాకు తెలుసు. వారిలో ఒకరు 86 ఏళ్లకు చనిపోయారు. మరొకరు ఇప్పటికీ బతికే ఉన్నారు. కాబట్టి ధూమపానం చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందనే వారు ఈ విషయాన్ని గమనించాలి" అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం నడుస్తున్న ధూమపావం క్యాన్సర్కు కారణం అవుతుందా? లేదా? అనేది చర్చనీయాంశమే కాదన్నారు. పొగాకు మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేసిన రాజకీయ నేతల్లో రామ్ ప్రసాద్ శర్మ మూడో వ్యక్తి.
అంతక ముందు బీజేపీ ఎంపీ దిలిప్ గాంధీ మాట్లాడుతూ ‘‘ పొగాకుతో క్యాన్సర్ వస్తుందని భారత్లో ఏ పరిశోధనా తేల్చలేదు. ధూమపానంతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని చెప్పిన పరిశోధనలన్నీ విదేశాల్లో జరిగినవే. ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్లలో బీడీ తయారీపై ఆధారపడి 4 కోట్ల మంది పనిచేస్తున్నారు'' అని దిలీప్ గాంధీ వ్యాఖ్యానించారు.
దిలీప్ గాంధీ వ్యాఖ్యలకు మరో ఎంపీ ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా ఆయనకు మద్దతు పలికారు. పొగాకు వినియోగానికి మద్దతు ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ మధుమేహ వ్యాధిని కలుగజేసే షుగర్పై నిషేధం లేనప్పుడు, క్యాన్సర్ కారకమని పొగాకును ఎలా నిషేధిస్తారని ప్రశ్నించారు.
సిగరెట్లు క్యాన్సర్ కలిగిస్తాయని భారతీయ పరిశోధనలు నిరూపించలేదని, విదేశీయులు చేసిన పరిశోధనలే అలా చెప్పాయని గుర్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులు, వాడకాన్ని తగ్గిచేందుకు పొగాకు ఉత్పత్తుల చట్టం-2003 పై వేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఈ ముగ్గురు సభ్యులు కావడం విశేషం. పొగాకు ఉత్పత్తులన్నింటిపై హెచ్చరిక చిహ్నాలు 85 శాతం మేర ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.