శుభవార్త: రైల్వే ఛార్జీల పెంపు లేదు: రైల్వే మంత్రి
న్యూఢిల్లీ: ప్రయాణీకులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరం కానుకను ప్రకటించింది. వచ్చే ఏడాది రైల్వే ఛార్జీలను పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది.ఈ మేరకు బుదవారం నాడు కేంద్ర రైల్వే శాఖ సహయ మంత్రి రాజేన్ గోహేన్ పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రకటించారు.
లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి రాజన్ గోహెన్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. చార్జీలను పెంచబోతున్నారా అన్న ప్రశ్నకు సమాధానిమిస్తూ ప్రస్తుతం ఇటువంటి ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి చెప్పారు .
ప్రతి ఏటా రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందన్నారు మంత్రి. గత ఏడాదితో పోలిస్తే ఏప్రిల్-నవంబరు 2017 నాటికి ప్రయాణీకుల రవాణాలో 0.68 శాతం పెరిగిన విషయాన్ని మంత్రి తన సమాధానంలో ప్రస్తావించారు., ఢిల్లీ, ముంబైల మధ్య 0.99 శాతం పెరుగుదలను నమోదు చేసినట్టు వెల్లడించారు.
ప్రత్యేక కార్యక్రమాలకు, పండుగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతుందని చెప్పారు.. ప్రయాణికుల డిమాండ్ మేరకు నడుపుతున్న ఈ ప్రత్యేక రైలు సర్వీసుల్లో బేసిక్ ఛార్జీలపై వివిధ స్థాయిల్లో 10 నుంచి 30 శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు చెప్పారు.