కెప్టెన్ పవన్కుమార్: దేశ భక్తుడి చివరి మెసేజ్
న్యూఢిల్లీ: ఆయన భారత సైన్యంలో కెప్టెన్. ఒక జాట్. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) డిగ్రీ పొందిన వ్యక్తి. ఏదేమైనా దేశం ఒక్కటే అతనికి ప్రాధాన్యం. దేశమంటే ప్రేమ. అతనికి ‘అజాదీ' అవసరం లేదు. రిజర్వేషన్లు కూడా అవసరం లేదు. ఆయనే శనివారం ఉగ్రవాదుల కాల్పుల్లో దేశం కోసం వీరమరణం పొందిన కెప్టెన్ పవన్ కుమార్.
తన చివరి ఫేస్బుక్ పోస్టులో.. దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలపై తనదైన శైలిలో ఆయన స్పందించారు. ‘కొందరికి రిజర్వేషన్లు కావాలి. కొందరికి స్వాతంత్య్రం కావాలి. నాకు మాత్రం నా దుప్పటి చాలు' అని పేర్కొన్నారు. ఒక సైనికుడి ఆలోచనతీరుకు, దేశభక్తికి ఈ మూడు వాక్యాలు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
జేఎన్యూలో కొందరు విద్యార్థులు తమకు స్వాతంత్ర్యం కావాలంటూ ఉగ్రవాదులకు మద్దతు పలుకుతూ దేశ వ్యతిరేక నినాదాలు చేసిన విషయం తెలిసిందే. అలాగే రిజర్వేషన్ల కోసం హర్యానాలో జాట్లు ఆందోళనలు చేస్తున్నారు. కాగా, ఇవన్నీ తనకు అవసరం లేదని.. తన దేశం మాత్రమే కావాలని పవన్ తన చివరి సందేశంలో పేర్కొన్నారు.
కొనసాగుతున్న కాల్పులు
జమ్మూకశ్మీర్లోని పాంపోర్లో మూడోరోజు ఉగ్రవాదుల కోసంవేట కొనసాగుతోంది. ఓ భవంతిలో దాగివున్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా సిబ్బంది యత్నిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్-జమ్ము ప్రధానరహదారిపై పాంపోర్ ప్రాంతంలోని ప్రభుత్వ భవనంలోకి ముష్కరులు చొరబడి కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే.
మూడు రోజులుగా భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతాసిబ్బంది ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాటు, వారి ఆయుధాలు, యుద్ధసామాగ్రిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇప్పటికే ఇద్దరు కెప్టెన్లు, ఓ జవాను మరణించారు. ఓ ఉగ్రవాదిని కూడా హతమార్చారు. ఆపరేషన్ కొనసాగుతోంది.