వానమ్మా.. వానమ్మా.. ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మా..! చినుకు జాడలేక అల్లాడుతున్న రైతన్న..!!
విశాఖపట్నం/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చుక్క వర్షం లేక రైతులు అల్లాడిపోతున్నారు. వేసవి ముగిసినా చినుకు జాడ లేదు. వర్షం చుక్క కోసం జనం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. జూన్లో జోరుగా పడాల్సిన వానలు నెలాఖరొచ్చినా కరుణించడం లేదు. రుతుపవనాలు విస్తరించిన తర్వాత కూడా ముఖం చాటేస్తున్న మేఘం రైతులను నిలువునా కుంగదీస్తోంది. దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత కొనసాగుతూనే ఉంది. వడగాడ్పులు వీస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో అక్కడక్కడా కురిసిన వర్షాలు ఆ తరువాత జాడలేకుండా పోయాయి. మరికొన్నిచోట్ల అసలు వర్షమే లేకపోవడంతో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టక పోవడం శోచనీయం.
రుతుపవనాలొచ్చినా కురవని మేఘం..! చినుకు జాడకోసం రైతుల ఎదురు చూపు..!!
జూన్లో దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం కొనసాగింది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే వారం ఆలస్యంగా కేరళను తాకాయి. ఆ తరువాత అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను రుతుపవనాల విస్తరణకు అడ్డంకిగా మారడంతో పాటు అటు అరేబియా సముద్రం, ఇటు భూ ఉపరితలంపై తేమను తీసుకుపోయింది. ఆ తరువాత రుతుపవనాలు పుంజుకున్నా ఆశించిన వర్షాన్ని ఇవ్వలేదు. దక్షిణాది మొత్తానికి రుతుపవనాలు విస్తరించాయని చెప్పడమే తప్ప చినుకు కురిసిన దాఖలాలు లేవు. శనివారానికి దేశ రాజధాని ఢిల్లీని రుతుపవనాలు తాకాల్సి ఉండగా, అందుకు మరో నాలుగైదు రోజులు పడుతుందని చెబుతున్నారు.
ఖరీఫ్ కు జూన్లో వర్షాలే కీలకం..!అనేక ప్రాంతాల్లో వేసవి వాతావరణం..!!
సాధారణంగా నైరుతి సీజన్లో ఖరీఫ్ పనుల ప్రారంభానికి జూన్లో కురిసే వర్షాలు ఎంతో కీలకం. అటువంటిది శనివారం వరకు దేశవ్యాప్తంగా 159మి.మీ. వర్షపాతానికి కేవలం 104.3మి.మీ.(34మి మీ లోటు) మాత్రమే నమోదైంది. సాధారణం కంటే దక్షిణాదిన 30మి.మీ. మధ్యభారతంలో 36మి.మీ. , వాయవ్య భారతంలో 34మి.మీ. తూర్పు/ఈశాన్య భారతంలో 35మి.మీ. తక్కువ వర్షం కురిసింది. దేశంలో ఒక్క తూర్పు రాజస్థాన్, జమ్ము కశ్మీర్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. విదర్భలో 74శాతం, తూర్పు మధ్యప్రదేశ్లో 66, జార్ఖండ్లో 60, ఢిల్లీ, పశ్చిమ యూపీలో 62శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
వర్షం కోసం జనాల ఎదురుచూపులు..!ఇంకా కొనసాగుతున్న ఎండ, ఉక్కపోత..!!
ఈ నాలుగు ప్రాంతాలను అత్యంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నవిగా గుర్తించారు. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడనున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఒడిసా నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. దాంతో మధ్య భారతం, దానికి ఆనుకుని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగుపడుతుందని, దక్షిణ, తూర్పు, ఈశాన్యంలో పెద్దగా వర్షాలు కురిసే అవకాశం ఉండదని అంచనా.
తెలుగు రాష్ట్రాల్లో దుర్భిక్షం..!తెలంగాణలో 37శాతం తక్కువ వర్షపాతం..!!
ఏపీ, తెలంగాణల్లో రైతులు వర్షంకోసం ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో శనివారం వరకు ఏపీలో సాధారణం కంటే 31శాతం, తెలంగాణలో 37శాతం లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాలో 35శాతం, రాయలసీమలో 22శాతం తక్కువగా వర్షం కురిసింది. గుంటూరు, అనంతపురం, కర్నూలు తప్ప మిగిలిన జిల్లాల్లో వర్షపాతం లోటు నమోదైంది. నెల్లూరులో 57శాతం, పశ్చిమగోదావరిలో 56, శ్రీకాకుళంలో 49, కృష్ణాజిల్లాలో 48శాతం తక్కువ వర్షపాతం కురిసింది. ఈ జిల్లాల్లో వ్యవసాయంతో పాటు తాగునీటికి సైతం జనం కటకటలాడుతున్నారు. తెలంగాణలో నాగర్కర్నూలు, కొమరంభీమ్, కరీంనగర్, జనగాం, జగిత్యాల, హైదరాబాద్ తప్ప మిగిలిన జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 50శాతం కంటే తక్కువగా నమోదైంది.