చినుకు రాలితేనే గొంతు తడిచేది.. జైపూర్లో నెల రోజుల్లో ఖాళీ కానున్న రిజర్వాయర్లు...
జైపూర్ : రుతుపవనాలు ఈ ఏడాది కష్టాలు, కడగండ్లు మిగిల్చేట్లు కనిపిస్తున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ వర్షాలు పడలేదు. వర్షాకాలం వచ్చి నెల దాటినా చినుకు రాలకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్లో అయితే పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా జైపూర్లో కేవలం ఒక నెలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
నెలకు సరిపడా మాత్రమే నీళ్లు
30లక్షల మంది జనాభా ఉన్న జైపూర్కు ప్రధాన నీటి వనరు బిసల్పూర్ డ్యామ్. అందులో కేవలం 30 రోజులకు సరిపడా మాత్రమే నీరు ఉంది. రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వసామర్థ్యం 1,095 క్యూసెక్కులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 64.93 క్యూసెక్కులు మాత్రమే. ఈ ఏడాది ఇప్పటి వరకు జైపూర్లో 116మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గతేడాది ఇదే సమయంలో అక్కడ 225 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కరువు కోరల్లో సగం రాష్ట్రం
రాజస్థాన్లోని 12 జిల్లాల్లో గతేడాది కన్నా 60శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఒక్క మాటలో చెప్పాలంటే సగం రాష్ట్రం, ముఖ్యంగా పశ్చిమ రాజస్థాన్ కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో 810 చిన్నా, పెద్ద డ్యామ్లు ఉండగా... వాటిలో 517 రిజర్వాయర్లలో 33శాతం నీరు మాత్రమే ఉంది. గత దశాబ్దకాలంలో రాష్ట్రంలో భూగర్భ జలాలు 62శాతం మేర తగ్గాయి. తాజాగా వర్షాభావం కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారనుంది.
దేశవ్యాప్తంగా తగ్గుతున్న భూగర్భ జలం
ఒక్క రాజస్థాన్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నీటి కష్టాలు కొనసాగుతున్నాయి. గత నెల చెన్నై దారుణమైన నీటి కష్టాలు ఎదుర్కొంది. సిటీకి నీళ్లందించే నాలుగు రిజర్వాయర్లు ఎండిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రైళ్లలో నీళ్లు తెప్పించేందుకు ప్రభుత్వం రూ.65 కోట్లు వెచ్చించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నీతి ఆయోగ్ అధ్యయనం ప్రకారం దేశ రాజధాని ఢిల్లీ, ఐటీ హబ్ బెంగళూరు సహా దేశంలోని 21 నగరాలు వచ్చే ఏడాది తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కోనున్నాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో భవిష్యత్తులో దాదాపు 600 మిలియన్ల ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పదని నివేదిక స్పష్టం చేసింది.