వింత శిక్ష: బహిర్భూమికి వెళ్లినందుకు రేషన్ కట్.. తప్పు చేస్తే సంక్షేమ పథకాల నుంచి పేర్లు తొలిగింపు..
భువనేశ్వర్: మహిళల బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి ఓ వింత శిక్షను అనుసరిస్తోంది ఓ గ్రామం. బహిర్భూమికి వెళ్లిన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకుంటోంది. చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా అయ్యే నిత్యావసర సరుకులను నిలిపివేసింది. క్రమంగా పింఛన్, ఇతర సంక్షేమ పథకాల నుంచి వారి పేర్లను తొలగించేలా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతోంది. ఆ గ్రామం పేరు గౌతమి. ఒడిశాలోని గంజాం జిల్లా సంఖేముండి బ్లాక్ పరిధిలో ఉంటుందీ గౌతమి గ్రామం.
రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర: మా బంధం ఫెవికాల్, సిమెంట్ కంటే దృఢం: బీజేపీ
బహిరంగ మల విసర్జనను స్వచ్ఛందంగా నిషేధించారు గ్రామస్తులు. కిందటి నెల 20వ తేదీన ఓ తీర్మానాన్ని కూడా చేశారు. అయినప్పటికీ.. దీన్ని ఉల్లంఘించి బహిర్భూమికి వెళ్లిన 20 కుటుంబాలకు చెందిన మహిళలకు రేషన్ ను నిలిపివేశారు. బహిర్భూమికి వెళ్లే వారిని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా వేశారు. స్వయం సహాయక బృందానికి చెందిన కొందరు మహిళలు గ్రూపుగా ఏర్పడి బహిర్భూమి విధానాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది. ఏ మహిళైనా బహిర్భూమికి వెళ్లినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ సర్పంచ్ సుశాంత్ స్వైన్ వెల్లడించారు.
ఈ నిబంధనను అతిక్రమించిన 20 కుటుంబాలకు రేషన్ ను నిలిపివేశారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ అధికారికంగా వెల్లడించారు. తాము బహిర్భూమికి వెళ్లబోమంటూ మహిళలు క్షమాపణ పత్రాన్ని రాసి ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తరువాతే నిత్యావసర సరుకులను సరఫరా చేస్తామని వెల్లడించారు. వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన కల్పించడం, గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే తాము ఈ తీర్మానం చేశామని, ఇందులో మరే ఉద్దేశం లేదని సుశాంత్ స్వైన్ తెలిపారు. పదే పదే అదే తప్పును చేస్తే.. పింఛన్ వంటి సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితా నుంచి వారి పేర్లను తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.