నో రిలాక్సేషన్: స్పష్టం చేసిన ముఖ్యమంత్రి: కాస్సేపట్లో కేసీఆర్ నిర్ణయం వెల్లడి
న్యూఢిల్లీ: మరి కొన్ని గంటలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 19 రోజుల రెండోదశ లాక్డౌన్ నుంచి పలు రాష్ట్రాలకు మినహాయింపు లభించబోతోంది. అన్ని ప్రాంతాల్లో కాకుండా.. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండే రెడ్జోన్లు, హాట్స్పాట్లకు మాత్రమే లాక్డౌన్ను పరిమితం చేసేలా నిర్ణయం తీసుకోవడానికి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అడుగులు వేస్తోన్న దశలో ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. లాక్డౌన్ సడలింపుల నుంచి తాము తప్పుకొంటున్నామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
నో రిలాక్సేషన్..
లాక్డౌన్ మినహాయింపులను తాము అమలు చేయబోవట్లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడున్న తరహాలోనే లాక్డౌన్ మరి కొన్నిరోజుల పాటు కొసాగుతుందని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ రాజధానిలో కరోనా తీవ్రత అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ను నియంత్రించడానికి తాము ఎన్ని చర్యలను తీసుకున్నప్పటికీ మానవ తప్పిదాల వల్ల అవన్నీ వృధా అవుతున్నాయని అన్నారు.
ఢిల్లీని కాపాడటానికే..
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీని వైరస్ బారి నుంచి కాపాడటానికి మినహాయింపును వద్దనుకుంటున్నామని తెలిపారు. వారం రోజుల తరువాత పరిస్థితులను సమీక్షిస్తామని చెప్పారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గినట్టుగా కనిపిస్తే.. వెంటనే సడలింపును అమలు చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీలో శనివారం ఒక్కరోజే 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని అన్నారు.
ఆందోళనకరంగా వ్యాప్తి..
తాము వైరస్ బారిన పడిన విషయం కూడా బాధితులకు తెలియదని అన్నారు. ఇది ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ తీవ్రతను బట్టి చూస్తోంటే.. ఢిల్లీలో లాక్డౌన్ను కొనసాగించాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడిందని చెప్పారు. ఢిల్లీలో ఇప్పటికే దాదాపు అన్ని ప్రధాన కేంద్రాలు, ప్రాంతాలను రెడ్జోన్లుగా, కరోనా హాట్స్పాట్లుగా గుర్తించామని కేజ్రీవాల్ వెల్లడించారు. రెడ్జోన్లు, హాట్స్పాట్లు లేని ప్రాంతాలు అతి తక్కువగా ఉన్నాయని, ఫలితంగా సడలింపును అమలు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు.
Recommended Video
కాస్సేపట్లో కేసీఆర్ నిర్ణయం..
ఇదిలావుండగా..సోమవారం నుంచి సడలింపులు అమల్లోకి రానున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో కూడా భారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోనే అనూహ్యంగా వందలాది కేసులు వెలుగు చూశాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది. సడలింపు సహా పలు అంశాలపై చర్చించడానికి తెలంగాణ మంత్రివర్గం ఆదివారం భేటీ కానున్న విషయం తెలిసిందే.