క్రైస్తవ సన్యాసినిపై రేప్: నిందితుడిగా చర్చి బిషప్: విచారణ వార్తలపై కేరళ కోర్టు నిషేధం
తిరువనంతపురం: కేరళను కుదిపేస్తోన్న క్రైస్తవ సన్యాసిని అత్యాచారం కేసులో న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చి బిషప్ ఫ్రాంకో ములక్కళ్ విచారణకు సంబంధించిన వార్తలను రాయొద్దంటూ వెల్లడించింది. విచారణకు సంబంధించిన వార్తలను ప్రింట్ మీడియాలో రాయడం, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయొద్దని ఆదేశించింది. మీడియాలో వెలువడుతోన్న కథనాలు ప్రజలను ప్రభావతం చేస్తాయనే ఉద్దేశంతో స్థానిక న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసినట్లు చెబుతున్నారు.
క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో బిషప్ ఫ్రాంకో ములక్కళ్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసుపై కొట్టాయం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇప్పటిదాకా వివిధ దశల్లో విచారణ కొనసాగింది. బుధవారం నుంచి మరో విడత ఆరంభమైంది. దీన్ని తుది విచారణగా భావిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో- ఈ కేసునకు సంబంధించిన ఎలాంటి వార్తలను పబ్లిష్ చేయొద్దని కొట్టాయం న్యాయస్థానం ఆదేశించింది. టెలికాస్ట్ చేయడంపైనా నిషేధం విధించింది. ఈ మేరకు కొట్టాయం అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి-1 జస్టిస్ జీ గోపకుమార్ ఆదేశాలను జారీ చేశారు.
Recommended Video
2014-2016 మధ్యకాలంలో క్రైస్తవ సన్యాసినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బిషప్ ఫ్రాంకో ములక్కళ్పై ఆరోపణలు ఉన్నాయి. 2018 జులై దీనికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. సేవ్ అవర్ సిస్టర్స్ పేరుతో క్రైస్తవ సన్యాసినులు కేరళలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవనెత్తారు. దీనితో ఫ్రాంకో ములక్కళ్ను అరెస్టు చేశారు. దీనిపై కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఛార్జిషీట్ను నమోదు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లోని 342, 376 (2) (కే), (ఎన్), 377, 506 (1) కింద కేసు నమోదైంది. విచారణ కొనసాగుతోంది.