మార్చి 1 నుంచి రైలు బోగీలపై రిజర్వేషన్ చార్ట్ కనిపించదు!
న్యూఢిల్లీ: మార్చి 1 నుంచి రైలు బోగీలపై రిజర్వేషన్ జాబితాలను అతికించరు. కాగిత రహిత పాలనలో భాగంగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా ఏ1, ఏ, బి శ్రేణి స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
ఈ మేరకు రైల్వే శాఖ అన్ని జోన్లకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆయా స్టేషన్లలో ఎలక్ట్రానిక్ డిజిటల్ డిస్ప్లేలపై రిజర్వేషన్ చార్ట్లను ప్రదర్శిస్తున్నందున.. ప్రత్యేకంగా రైలు బోగీలపై జాబితాలను అతికించాల్సిన అవసరం లేదని రైల్వేశాఖ భావన.
తెలుగు రాష్ట్రాల్లోని 34 స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, ఖాజీపేట, ఖమ్మం, మంచిర్యాల, నిజామాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్లు ఉన్నాయి.
ఇంకా.. పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, అనంతపురం, అనకాపల్లి, భీమవరం టౌన్, చీరాల, కడప, ఏలూరు, గూడూరు జంక్షన్, గుంటూరు జంక్షన్, గుంతకల్, కాకినాడ టౌన్, కర్నూలు టౌన్, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, రేణిగుంట, సామర్లకోట, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఆర్థిక క్రమశిక్షణను పాటించడానికి ఈ నూతన విధానం ఉపయోగపడుతుందని, ఇప్పటికే ఈ విధానాన్ని బెంగళూరు డివిజన్ పాటిస్తోందని, ఇక ఏ1, ఏ, బీ క్యాటగిరీ రైల్వేస్టేషన్లలోని అన్ని రైళ్లకు ఈ నూతన విధానాన్ని వర్తింపజేయాలని రైల్వే శాఖ తన ఉత్తర్వుల్లో కోరింది.