ఇంతకంటే మంచి ఆఫర్ ఇవ్వలేం, బంతి మీ కోర్టులోనే: రైతు నేతలతో తేల్చేసిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. శుక్రవారం కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్.. రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన 11వ విడత చర్చల్లోనూ ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తదుపరి చర్చలకు సంబంధించి తేదీ ఖరారు చేయకుండానే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
Recommended Video
ఈ సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధుల వ్యవహారశైలిపై కేంద్రమంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టంలో లోపం లేకపోయిన ప్రతిపాదనలు చేశామన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్. 18 నెలలపాటు ఈ చట్టాలను ప్రతిష్టంబింపజేసే ప్రతిపాదన మించింది ఏదీ తమ వద్ద లేదని అన్నారు. దీనిపై రైతులు నిర్ణయం తీసుకోలేదన్నారు.
'బంతి మీ కోర్టులోనే ఉంది.. కేంద్ర ప్రతిపాదనలపై మీ నిర్ణయం చెబితే మళ్లీ చర్చించేందుకు సిద్ధం' అని రైతు సంఘాల ప్రతినిధుల వద్ద కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఆ తర్వాత నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నేతలు చర్చలు జరపకపోవడం బాధాకరమని అన్నారు.
గత సమావేశంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను దేశం, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పునర్ పరిశీలించాలని కోరామన్నట్లు తెలిపారు. ఈ మూడు వ్యవసాయ చట్టాల రద్దు మినహా మరే ప్రతిపాదనతోనైనా రావాలని రైతు నేతలను కోరారు. కేంద్రం ఇచ్చిన ఆఫర్ కంటే మెరుగైన ప్రతిపాదనతో వస్తే చర్చించేందుకు సిద్ధమని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు.
ఇది ఇలావుంటే, 10 నిమిషాల కన్నా మించి చర్చలు జరగలేదని, తదుపరి చర్చలు కొనసాగుతాయని కూడా తాము అనుకోవడం లేదని రైతు సంఘాల నేతలు తెలిపారు. తాము మాత్రం ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. కేంద్ర మంత్రులు ఇచ్చిన ప్రతిపాదనల కంటే మంచి ప్రతిపాదనలు వస్తేనే చర్చలు జరుపుతామని చెప్పారని తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజున తలపెట్టిన పరేడ్ కోసం పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. శాంతియుతంగానే పరేడ్ నిర్వహిస్తామన్నారు. ఇక జనవరి 26 తర్వాత ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే విషయంపై చర్చించుకుంటామని తెలిపారు.