JEE, NEETపై కేంద్రం కుండబద్దలు - ఇప్పటికే 85 శాతం డౌన్లోడ్స్ - విద్యార్థుల ఒత్తిడివల్లే:పోఖ్రియాల్
వివాదాస్పదంగా మారిన నీట్(NEET),జేఈఈ(JEE) పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షలను వాయిదా వేయబోమని కుండబద్దలు కొట్టింది. పరీక్షల వాయిదా కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న వేళ.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నందు వల్లే ముందుకు వెళుతున్నామని, రెండో ఆలోచనేదీ తమకు లేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వ్యాఖ్యానించారు.
కరోనా లాక్ డౌన్ దారుణం- జీతం కోతపై యజమానితో గొడవ - పీక కోసి బావిలో పడేసిన ఉద్యోగి
చెంపలేసుకున్న శ్రీలంక - చైనాతో ఒప్పందం భారీ తప్పిదం - ఇకపై 'ఇండియా ఫస్ట్' పాలసీ -నమ్మొచ్చా?
అనూహ్యం: గాల్వాన్పై చైనా పశ్చాత్తాపం - హింస దురదృష్టకరమన్న రాయబారి వీడాంగ్ - ఆత్మనిర్భర్పై అక్కసు
దేశవ్యాప్తంగా ఆందోళనలు..
ఐఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సు ప్రవేశానికి జేఈఈ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు, అలాగే, మెడికల్ ఎంట్రెన్స్ కు సంబంధించిన నీట్ పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సిద్ధమైంది. అయితే, దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షల నిర్వహణ సరికాదని, వాటిని మరో రెండు నెలలు వాయిదా వేయాలనే డిమాండ్ వ్యక్తమైంది. దీనిపై లక్షల మంది విద్యార్థులతోపాటు రాజకీయ పార్టీలూ ఆందోళనకు దిగాయి. అయితే, పరీక్షల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కేంద్రానికి మరింత బలం చేకూర్చినట్లయింది. అయినాసరే వెనక్కి తగ్గని పలువురు విద్యార్థులు తమ ఇళ్ల ముందు నిలబడి నిరసనల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈలోపే..
ఇప్పటికే 85 శాతం మంది రెడీ..
‘‘ఈ ఏడాది జేఈఈ, నీట్ పరీక్షలు ఇదివరకే రెండు సార్లు వాయిదా పడ్డాయి. మరోసారి వాయిదా వేస్తే విద్యా సంవత్సరమంతా లాస్ అయిపోతుంది. సుప్రీంకోర్టు సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. పైగా, పరీక్షలు తొందరగా నిర్వహించాలంటూ విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. అదీగాక ఇప్పటికే 85 శాతం మంది జేఈఈ విద్యార్థులు అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది జేఈఈకి మొత్తం 8.85లక్షల మంది హాజరవుతుండగా, వాళ్లలో 7.25లక్షల మంది అడ్మిట్ కార్డులు తీసేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయి'' అని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. బుధవారం దూరదర్శన్ తో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
మళ్లీ వాయిదా విద్యార్థులకే నష్టం..
జేఈఈ, నీట్ పరీక్షలను మరోసారి వాయిదా వేయడం వల్ల విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ రాంగోపాల్ రావు అభిప్రాయపడ్డారు. పరీక్షల తరువాత చాలా పని ఉంటుందని, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావడానికే రెండు నెలలు పడుతుందని, సెప్టెంబర్ లోగానీ పరీక్షలు జరగకుంటే ఈ ఏడాది మొత్తం లాస్ అయిపోతుందని చెప్పారు. జేఈఈ, నీట్ నిర్వహణ కోసం ఎన్టీఏ పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని, కొవిడ్ ప్రొటోకాల్స్ కు అనుగుణంగా అన్ని కేంద్రాల్లో తగిన చర్యలు ఉంటాయని రాంగోపాల్ రావు తెలిపారు.
Recommended Video
షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్..
ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఓ వైపు విద్యార్థులు నిరసనలు తెలుపుతుండగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో నాన్ బీజేపీ ముఖ్యమంత్రులంతా కలిసి రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ విషయంలో కేంద్రంపై న్యాయపోరాటం చేయాలని బుధవారం నాటి సమావేశంలో నాన్ బీజేపీ సీఎంలు తీర్మానించారు. బెంగాల్ సీఎం మమత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇదివరకే విడివిడిగా ప్రధాని మోదీకి లేఖలు సైతం రాశారు. అయితే, జేఈఈ, నీట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, వాయిదా వేసే ఆలోచన లేనేలేదని కేంద్ర విద్యా శాఖ అధికారులు మీడియాకు స్పష్టం చేశారు.