5ఏళ్లు నేనే సీఎం, కాంగ్రెస్తో రొటేషన్ పద్ధతిలేదు: కుమారస్వామి, గాలికి లొంగని బసవన గౌడ, ఎవరితను?
బెంగళూరు: కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జేడీఎస్ అధినేత కుమార స్వామి సీఎం పదవి పంపకంపై ఆదివారం స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్కు, తమకు మధ్య సీఎం పదవి విషయంలో రొటేషన్ పద్ధతి ఒప్పందం ఏదీ లేదని చెప్పారు. తానే అయిదేళ్ల పాటు సీఎంగా ఉంటానని చెప్పారు.
రాయచూరు రూరల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన దద్దల బసవన గౌడను బీజేపీలోకి రప్పించుకునేందుకు చివరి వరకు ప్రయత్నాలు జరిగాయి. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఫోన్లో ప్రలోభపెట్టారని ఆరోపణలు వచ్చాయి. వారిద్దరూ సంభాషించుకున్న ఆడియోలు బయటకు వచ్చాయి. అది తన స్వరం కాదని గాలి చెప్పారు. కాగా, బసవన గౌడ గతంలో ఆర్టీసీ బస్సు డ్రైవరు కం కండెక్టర్. మాన్వి డిపోలో పని చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకుల వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు.
ప్రస్తుతం ఉన్న ఆస్తిని వందరెట్లు పెరిగేలా చూస్తామని ఆశ చూపినా తనను నమ్మి టికెట్ ఇప్పించి గెలిపించిన వారి పట్ల విధేయత, నైతికత చాటిన నేపథ్యంలో రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే బసవన గౌడ జాతీయ స్థాయిలో ఒక్కసారిగా గుర్తింపు సాధించారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. కానీ యువ కాంగ్రెస్ నాయకుడు రవి ఆయనకు టికెట్ ఇప్పించడంతో పాటు గెలుపు భారం మీద వేసుకున్నారు.
బసవన గౌడ ఆర్టీసీలో పని చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు బోసురాజు రాజకీయాల్లోకి ఆహ్వానించారు. దీంతో పదమూడేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు. భార్య జెడ్పీటీసీగా గెలుపొందారు. అప్పుడు దద్దల ఎత్తిపోతల పథక బాధ్యునిగా నియమితుడయ్యారు. అదే ఇంటిపేరుగా మారింది.
అనంతరం బీజేపీలో చేరి 2008లో రాయచూరు రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాజరాయప్ప చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ప్రస్తుత మొలకాల్మూరు ఎమ్మెల్యే శ్రీరాములు గతంలో స్థాపించిన బీఎస్సార్ పార్టీలో చేరారు. 2013లో మాన్వి నుంచి పోటీ చేసి ఓడారు.
ఈసారి ఎన్నికల్లో రాయచూరు గ్రామీణ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. దద్దల్తో గతంలో ఉన్న సంబంధం, ఆయన ఆర్థిక విషయాలు బాగా తెలిసిన గాలి జనార్ధన్ రెడ్డి బేరసారాలు చేసినా ఫలించలేదంటున్నారు. దీంతో ఆయనను కాంగ్రెస్ నేతలు అభినందిస్తున్నారు. సిద్ధరామయ్య, కుమారస్వామి ప్రత్యేకంగా అభినందించారు.