శశికళను మరిచారు!: పన్నీరుకే జయలలిత 'అధికారం', ఇలా..
ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతుగా వెలిసిన బ్యానర్ను తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు.
చెన్నై: ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతుగా వెలిసిన బ్యానర్ను తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను శశికళకు అప్పగించాలని చాలామంది నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శశికళకు మద్దతుగా రాష్ట్రంలో బ్యానర్లు వెలుస్తున్నాయి. అలాగే, ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతుగా కూడా బ్యానర్లు వెలుస్తున్నాయి. శశికళ పార్టీ బాధ్యతలను చేపట్టాలని రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు కోరుకుంటూ, బ్యానర్లు కడుతున్నారు.
అజిత్ ఔట్, పన్నీరు సైలెన్స్!: శశికళ చక్రం, జయలలిత బతికే ఉంటే..?
కానీ, పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జయలలిత రెండుసార్లు పోటీ చేసి గెలుపొందిన ఆండిపట్టి నియోజకవర్గంలోని జి ఉశలంపట్టిలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్ వెలిసింది.
ఈ బ్యానర్లో శశికళ ఫోటో లేదు. 'అమ్మ ఆశయాలు, ఆలోచనలను ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు' తెలుపుతున్నామంటూ ఉన్న ఈ బ్యానర్లో నిర్వాహకుల పేర్లు మాత్రం ముద్రించలేదు.
ఇది శశికళ మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించింది. పలువురు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడంతో, బ్యానర్ను తొలగించాలంటూ పోలీసులకు ఉత్తర్వులు అందాయి.
దీంతో పోలీసులు బ్యానర్ తొలగించేందుకు ఆ ప్రాంతానికి వెళ్లారు. పోలీసుల తీరును నిరసించిన స్థానికులు అమ్మ పథకాలను కొనసాగించాలనే బ్యానర్లో ఉందని, ఎవరిని కించపరచే విధంగా వ్యాఖ్యలు లేవని, ఈ స్థల యజమానుల అనుమతితోనే ఏర్పాటు చేశామని వాగ్వాదానికి దిగారు.
ఇదిలా ఉండగా, జయలలిత పరోక్షంగా పన్నీరు సెల్వంకే వారసత్వ పగ్గాలు అప్పగించారనేది ముఖ్యమంత్రి వర్గం అభిప్రాయం. జయలలిత రెండుసార్లు జైలుకు వెళ్లినప్పుడు పన్నీరునే సీఎం చేశారని, శశికళ నెచ్చెలి అయినప్పటికీ.. రాజకీయంగా మాత్రం పన్నీరుకే ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు.