‘తలాక్ చెప్పే పద్ధతిలో మార్పులు ఉండవు’
లక్నో: విడాకుల మంజూరుకి మూడు తలాక్లు ఒకేసారి చెప్పే పద్ధతి (ట్రిపుల్ తలాక్)లో మార్పులు వచ్చే అవకాశం లేదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) తెలిపింది.
విడాకులు ఖరారు చేసేముందు భార్యాభర్తలకు మూడు నెలల వ్యవధిని తప్పనిసరి చేయాలన్న వివిధ ముస్లిం సంఘాల సూచనలను బోర్డు తిరస్కరించింది.
‘ఖురాన్, హాదిత్ ప్రకారం మూడు తలాక్లు ఒకేసారి చెప్పడం నేరం. కానీ ఓసారి ఇలా చెప్తే విడాకుల ప్రక్రియ ముగిసినట్లుగా పరిగణించాలి. దీన్ని మార్చడం సాధ్యం కాదు. ఇదివరకు మూడు తలాక్లు ఒకేసారి చెప్పిన భర్తలపై చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అలా చేయడం కుదరదు' అని ఏఐఎంపీఎల్బీ అధికార ప్రతినిధి మౌలానా అబ్దుల్ రహీమ్ ఖురేషీ.. విలేకరులతో గురువారం చెప్పారు.
మూడు తలాక్లను ఒకేసారి చెప్తే.. దాన్ని ఒకసారి తలాక్ చెప్పినట్లే పరిగణించేలా పద్ధతిని మార్చేందుకు ఏదైనా అవకాశం ఉందా? అని దేవ్బంది, బెరేల్వి వర్గాలతో కలిసి అఖిల భారత సున్నీ ఉలేమా మండలి తమ బోర్డుకు లేఖ రాసినట్లు వార్తలు విన్నానని చెప్పారు.