రెండవ రాజధానిపై అధికారిక ప్రకటన చేసిన కేంద్రం
దేశ రెండో రాజధానిపై కేంద్రం అధికారిక స్పష్టత ఇచ్చింది. దేశానికి రెండో రాజధాని ప్రతిపాదన ఏదీ లేదంటూ పార్లమెంట్లో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రాంచంద్రరావు ఇదే అంశంపై పార్లమెంట్లో ప్రశ్నను లేవనెత్తారు. దేశానికి రెండవ రాజధాని ప్రతిపాదన ఏదైనా ఉందా ..., ఉంటే దాని వివరాలు ఏమిటని ఆయన రాతపూర్వక ప్రశ్నను సంధించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశానికి రెండవ రాజధాని ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు.
రాజధానిపై నిపుణుల కమిటీ రిపోర్ట్ రెడీ: తరలింపు ఖాయమే అని ఏపీలో చర్చ
ఢిల్లీ కాలుష్యంతో రాజధాని ప్రస్తావన
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ఇటివల కాలుష్యానికి గురి కావడంతో హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేస్తారని ప్రచారం ఊపందుకుంది. ఇందుకు సంబంధించి మీడియాలో కూడ పలు కథనాలు వెలువడ్డాయి. ఇక దేశానికి దక్షిణాదిలో ఉన్న హైదరాబాద్ను రెండవ రాజధాని చేయాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయో సమయంలో పలు డిమాండ్స్ వచ్చాయి. విభజన సమయంతో పాటు రాజ్యంగ నిర్మాత బీ.ఆర్ అంబేద్కర్ సైతం హైదారాబాద్ను దేశానికి రెండవ రాజధానిని చేయాలని కూడ చెప్పినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈనేపథ్యంలోనే రెండవ రాజధానిపై పలు ఊహాగానాలు ఏర్పడుతున్నాయి.
ప్రచారానికి బలమిచ్చిన విద్యాసాగర్ రావు
ఇక రెండవ రాజధాని ప్రచారానికి ఊతం ఇస్తూ... మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు కూడ ప్రస్తావించారు. హైదరాబాద్ను రెండవ రాజధానిగా చేసే అవకాశాలు ఉన్నయనే సంకేతాలను ఇచ్చారు. రాజధాని మార్పుకు ఢిల్లీ కాలుష్యం మాత్రమే కారణం కాదని, ఇందుకు సంబంధించి రాజకీయ కారణాలు కూడ ఉన్నాయని అన్నారు. రాజధాని ఏర్పాటుకు సంబంధించి అంబేద్కర్ సహేతుకమైన కారణాలను వివరించారని చెప్పారు. మరోవైపు ఎన్నికల ముందుకూడ ఇదే అంశంపై చర్చ జరిగిందని, అయితే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకోవాలని సూచించారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రెండవ రాజధానిగా హైదరాబాద్ ఏర్పడితే బాగుంటుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఖండించిన కిషన్ రెడ్డి
అయితే ఇదే అంశంపై కేంద్ర సహయ మంత్రి కిషన్ రెడ్డి అనధికారికంగా స్పందించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశానికి హజరైన అనంతరం ఆయన స్పష్టతను ఇచ్చారు. దేశ రెండవ రాజధాని ఏర్పాటుపై హోంశాఖ వద్ద ఎలాంటీ ప్రతిపాదన లేదని చెప్పారు. అయితే కేంద్రమంత్రి అనధికారిక ప్రకటన చేసిన నేపథ్యంలోనే కొంతమంది నాయకులు మాత్రం దేశ రెండో రాజధానిపై మాత్రం మాట్లాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది నేతలు దీనిపై డిమాండ్ కూడ లేవనెత్తారు. మొత్తం మీద నెలరోజులుగా వస్తున్న ప్రచారంపై అధికారిక సమాచారం ఇవ్వడంతో రాజధానిపై వస్తున్న ఊహగానాలకు కేంద్రం తెరదించింది.