రైల్వే ప్రయాణికులకు శుభవార్త: మార్చి వరకు నో సర్వీస్ ఛార్జెస్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ మరో శుభవార్త అందించింది. ఆన్లైన్ టికెట్ల బుకింగ్పై సర్వీస్ ఛార్జీలను వచ్చే ఏడాది మార్చి వరకు వసూలు చేయబోమని ప్రకటించింది. గత నవంబరులో ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్ బుకింగ్స్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సర్వీస్ చార్జీలను ఎత్తివేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం దీనిని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ ఏడాది జూన్ 30 వరకు సర్వీస్ ఛార్జీలను ఎత్తివేయగా దానిని సెప్టెంబరు 30 వరకు పొడిగించింది. తాజాగా వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
నోట్ల రద్దుకు ముందు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసే వారి నుంచి ఐఆర్సీటీసీ ఒక్కో టికెట్కు రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేసేది. ఆన్లైన్ టికెట్ల బుకింగ్ ద్వారా ఐఆర్సీటీసీకి 33 శాతం ఆదాయం సమకూరుతున్నట్టు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంలో రైల్వేకు వచ్చిన రూ.1500 కోట్లలో రూ.540 కోట్లు సర్వీస్ ఛార్జీల ద్వారా వచ్చినవేనని ఆయన తెలిపారు. 2016 నవంబరు 23 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 27 వరకు ప్రయాణికుల నుంచి సేవా రుసుం, సేవా పన్ను రూపంలో రూ.184 కోట్లు వసూలు చేయకుండా వదిలేసినట్లు రైల్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి.