పెళ్లయిన నాటి నుంచి 'నో సెక్స్': వివాహం రద్దు చేయవచ్చన్న కోర్టు..
ముంబై: ఇద్దరు వ్యక్తుల మధ్య శృంగారాన్ని చట్టబద్దం చేయడం వివాహం యొక్క ప్రధాన ఉద్దేశం. అది నెరవేరనప్పుడు దాని ఉద్దేశం దెబ్బతింటుంది. కాబట్టి దంపతుల మధ్య శృంగార సంబంధం లేకపోతే ఆ ప్రాతిపదికన వారి వివాహం రద్దు చేయవచ్చునని ఓ కేసుకు సంబంధించి ముంబై హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది.
కొల్హాపూర్ కు చెందిన ఓ దంపతుల విడాకులకు సంబంధించి కోర్టు ఈ తీర్పు వెలువరించింది. వారిద్దరి పెళ్లయిన మొదటిరోజు నుంచే విభేదాలు మొదలయ్యాయి. కొన్ని బ్లాంక్ పత్రాలపై సంతకం చేయించుకుని తనను మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడని, కాబట్టి ఈ వివాహాన్ని రద్దు చేయాలని భార్య కోర్టును ఆశ్రయించింది. మరోవైపు భర్త మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. దీనిపై జస్టిస్ మృదులా భట్కర్ విచారణ జరిపారు.
భర్త ఆమెను మోసం చేశాడనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, అదే సమయంలో వారిద్దరి మధ్య శృంగార సంబంధం ఉందనడానికి కూడా ఎటువంటి ఆధారం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
'దంపతుల మధ్య శృంగారాన్ని చట్టబద్దం చేయడం వివాహ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. అలాంటి ఉద్దేశం నెరవేరనప్పుడు ఆ వివాహం సందిగ్ధంలో పడుతుంది. కనీసం ఒక్కరోజు శృంగార కార్యంలో పాల్గొన్నా వివాహానికి సంపూర్ణత చేకూరుతుంది' అని న్యాయమూర్తి చెప్పారు.
'ప్రస్తుత కేసుకు సంబంధించి.. దంపతులు ఒక్కరోజు కూడా కలిసి ఉన్నట్టు ఆధారాలు లేవు. ఆధారాలను సమర్పించడంలో ఆమె భర్త విఫలమయ్యాడు. అలాగే ఇద్దరి మధ్య శృంగార సంబంధం ఉందనడానికి కూడా ఎటువంటి ఆధారం లేదు. కాబట్టి ఈ వివాహానికి పరిపూర్ణత చేకూరలేదని ఆమె వాదిస్తోంది' అని అన్నారు.
మరోవైపు భర్త మాత్రం తమ మధ్య శృంగార సంబంధం ఉందని, తన వల్ల ఆమె గర్భవతి కూడా అయిందని వాదించాడు. కానీ దానికి సంబంధించిన గైనకాలజీ రిపోర్టులను మాత్రం చూపించలేకపోయాడు.
'ఈ ఇద్దరు ఒకరి పట్ల ఒకరు తీవ్ర వ్యతిరేకతతో, ప్రతీకారంతో ఉన్నారు. ఈ కారణంగా వీరి తొమ్మిదేళ్ల జీవితం వ్యర్థమైపోయింది. ఇదిలాగే కొనసాగితే వీరి జీవితం మరింత నాశనమవుతుంది. కాబట్టి దంపతుల మధ్య శృంగార సంబంధం లేకపోతే ఆ ప్రాతిపదికన వారి వివాహం చెల్లుబాటు కాదు.' అని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.