నా పర్యటనల్లో ప్రత్యేక ఏర్పాట్లు, ఆర్భాటాలు వద్దు: అధికారులకు సీఎం యోగి ఆదేశాలు
తాను పర్యటించే ప్రాంతాల్లో తన కోసం ఎటువంటి ఆర్భాటాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర అధికారులను ఆదేశించారు.
లక్నో: తాను పర్యటించే ప్రాంతాల్లో తన కోసం ఎటువంటి ఆర్భాటాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర అధికారులను ఆదేశించారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల రెండు ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో అధికారులు చేసిన హడావుడి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అవి వివాదాస్పదంగా మారడంతో వాటిపై సీఎం యోగి కూడా సీరియస్ అయ్యారు.
ఈ మేరకు ఆయన ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 'మనం నేలపై కూర్చొని ఉండేవాళ్లమే, అందుకే ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ వద్దు. ముఖ్యమంత్రి అనే గౌరవం ఉంటే చాలు' అని తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
గతనెల బీఎస్ఎఫ్ జవాను ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం వెళ్లిన సమయంలో ఆ ఇంటిని అధికారులు ఖరీదైన వస్తువులతో నింపారు. సీఎం వెళ్లిపోగానే అధికారులు ఇంట్లో పెట్టిన ఏసీ, సోఫా తదితరాలను తీసేశారు.
దాంతో తమను అధికారులు అవమానించారంటూ అమరజవాను సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గతవారం కూడా సీఎంను కలిసేందుకు వచ్చే ప్రజలను స్నానాలు చేసి రావాలంటూ సబ్బులు, షాంపూలు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.