అనిల్ అంబానీ ఆర్ఎన్ఈఎల్ను ప్రత్యేకంగా చూడటం లేదు: నేవీ చీఫ్
న్యూఢిల్లీ: ఆరు ఆఫ్ షోర్ పాట్రోల్ వెసల్స్ను సరైన సమయంలో అందించనందుకు రిలయెన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ పైన ఇండియన్ నేవీ సరైన చర్యలు తీసుకుంటుందని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా సోమవారం చెప్పారు. అనిల్ అంబానీకి చెందిన ఆ కంపెనీని మిగతా వాటికి భిన్నంగా చూసేది లేదని తేల్చి చెప్పారు.
ఆ కంపెనీ పట్ల ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ లేదన్నారు. బ్యాంకు గ్యారంటీని ఎన్క్యాష్ చేశామని చెప్పారు. సరైన సమయంలో అందించనందుకు అది సరైన చర్య అని, వారిని ప్రత్యేకంగా చూసేది లేదని చెప్పారు.
2011 మే నెలలో నేవీ రూ.2,974 కోట్ల కాంట్రాక్టును పిపావవ్ కంపెనీకి అప్పగించింది. ఐదు ఆఫ్ షోర్ పాట్రోల్ వెసల్స్ కోసం ఈ కాంట్రాక్ట్ కుదిరింది. ఇందులో భాగంగా మొదటి షిప్ను 2015 వరకు ఇవ్వాలి. ఈ పిపావవ్ కంపెనీని 2015లో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ స్వాధీనం చేసుకుంది.
ఇదిలా ఉండగా ఈ కంపెనీ రెండు షిప్స్ను 2017 జూలైలో ప్రారంభించాయి. ఆలస్యంగా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో నేవీ చీఫ్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
అనిల్ నేతృత్వంలోని ఆర్ఎన్ఈఎల్ను రక్షించేందుకు ఏమైనా ఒత్తిడి ఉందా అని అడిగారు. దానికి నేవీ ఛీఫ్ స్పందిస్తూ... వారిని ప్రత్యేకంగా చూడమని, ఇప్పటికే నేవీ బ్యాంకు గ్యారెంటీని ఎన్క్యాష్ చేసిందని, కాబట్టి ఆర్ఎన్ఈఎల్ పైన సరైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాక్టును క్యాన్సిల్ చేసుకోలేదని, అయితే ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు.