శరద్ పవార్ పంచ్: కూటమి గురించి సోనియాతో చర్చించలేదు, 170 సీట్లు ఎక్కడివి..?
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై మహా ట్విస్టులు నెలకొంటున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి అధికారం చేపట్టబోతుందని, కనీస ఉమ్మడి ప్రణాళికపై కూడా ప్రాథమికంగా చర్చించారని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బాంబ్ పేల్చారు.
పవార్ పంచ్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమైన పవార్.. కూటమి అంశం గురించి చర్చించలేదని బావిలో రాయి పడేసినంత పనిచేశారు. దీంతో మహారాష్ట్రలో శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంద లేదా అనే అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. శివసేన కూటమి ఏర్పాటు కలేనా అనే అంశం చర్చకు దారితీసింది.
సంఖ్య గురించి మాత్రమే..
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు గురించి తాను సోనియాగాంధీతో చర్చించలేదని శరద్ పవార్ స్పష్టంచేశారు. ఇతరులతో కూడా ప్రభుత్వ ఏర్పాటు గురించి డిస్కస్ చేయలేదన్నారు. మహారాష్ట్రలో ఆయా పార్టీల సంఖ్య, పరిస్థితిపై మాత్రమే సోనియాగాంధీతో చర్చించానని పవార్ స్పష్టంచేశారు. సమావేశంలో స్వాభిమాని షెట్కారీ సంగటన్ కూడా తమతో ఉన్నారని, వారి ఎమ్మెల్యే కూడా సమావేశంలోపాల్గొన్నారని పేర్కొన్నారు.
చిన్న, చితకా పార్టీలు కూడా..
ఎన్నికల్లో ఎస్పీకి కొన్ని సీట్లు వదిలేయడంతో గెలవేలకపోయామని శరద్ పవార్ పేర్కొన్నారు. ఎస్పీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్పారు. రిపబ్లికన్ పార్టీ కూడా తమకు మద్దతునిస్తోందని శరద్ పవార్ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి అందరి అభిప్రాయాలను, మద్దతు తీసుకుంటామని పవార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని పార్టీ సీనియర్ నేతలు గమనిస్తున్నారని పవార్ పేర్కొన్నారు.
వాట్ నెక్ట్స్
ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని శివసేన ధీమాతో ఉన్న సమయంలో శరద్ పవార్ కామెంట్స్ కాస్త కలవరానికి గురిచేసింది. ఇంతకీ మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా ? లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పవార్ వ్యాఖ్యలపై శివసేన స్పందించాల్సిన అవసరం ఉంది.