రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను వద్దు : డెలాయిట్ సర్వేలో నిపుణుల సూచన
వచ్చే కేంద్ర బడ్జెట్ లో అయినా కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తులపై పన్నుల భారం తగ్గించాలని ట్యాక్స్ కన్సల్టెంట్ సంస్థ డెలాయిట్ చేసిన సర్వేలో నిపుణులు కోరారు.
న్యూఢిల్లీ: ఆర్ధిక వ్యవస్థకు కొత్త కిక్ ఇచ్చేందుకు వచ్చే కేంద్ర బడ్జెట్ లో అయినా కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తులపై పన్నుల భారం తగ్గించాలని ట్యాక్స్ కన్సల్టెంట్ సంస్థ డెలాయిట్ చేసిన సర్వేలో నిపుణులు కోరారు.
పన్నులు విధించేందుకు ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉన్న వ్యక్తిగత వార్షిక ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచడంతోపాటు సెక్షన్ 80సి కింద ఇస్తున్న రూ.1.5 లక్షల పన్ను మినహాయింపులను రూ.2.5 లక్షలకు పెంచాలని ఈ సర్వేలో పాల్గొన్న అధికులు కోరారు.
రాబోయే కేంద్ర బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని డెలాయిట్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వలన, వినియోగదారుల వద్ద ఉండే నగదు పెరిగి అనేక వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని నిపుణులు సూచించారు.
దేశంలో పొదుపు రేటు మరింత పెంచేందుకు ప్రస్తుతం ఉన్న ఆదాయ శ్లాబుల సంఖ్యను మరింత పెంచాలని కూడా సర్వేలో పాల్గొన్న నిపుణులు కోరారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెట్టుబడులు పెరుగుతాయని, ఉద్యోగ అవకాశాలూ పెరుగుతాయని వారు అభిప్రాయపడ్డారు.
ఈపీఎఫ్ మాదిరిగా నేషనల్ పెన్షన్ స్కీమ్ ( ఎన్ పి ఎస్ ) ను విజయంతం చేయాలంటే ఉపసంహరణ సమయంలో ఈ స్కీమ్ నిధుల్లో 60 శాతం నిధుల్లో పన్ను విధించడాన్ని ఎత్తివేయాలని కూడా నిపుణులు సూచించారు.
అలాగే మౌలిక సదుపాయాల ప్రాజేక్ట్లులకు సంబంధించిన బాండ్లలో పెట్టే పెట్టుబడులకు కూడా పన్ను మినహాయింపును మళ్ళీ పునరుద్ధరించాలని ఆర్ధిక మంత్రి జైట్లీకి వారు విజ్ఞప్తి చేస్సారు. ఈ మినహాయింపు పరిమితి ఏటా కనీసం రూ.50 వేల వరకు ఉండాలని అభిప్రాయపడ్డారు.