బాలీవుడ్ డ్రగ్స్ కేసులో చాట్స్ లీకేజీతో దుమారం... వాట్సాప్లో చాట్స్ సేఫేనా... ఆ సంస్థ ఏమంటోంది...
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతూనే ఉంది. కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దూకుడు పెంచడం... హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్,దీపికా పదుకొణే,శ్రద్దా కపూర్లకు నోటీసులు జారీ చేయడంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో ఈ పేర్లు బయటకు రావడం వెనుక వాట్సాప్ చాట్సే కీలకం కావడంతో... యూజర్ ప్రైవసీపై సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో వాట్సాప్ దీనిపై వివరణ ఇచ్చుకోక తప్పలేదు.
డ్రగ్స్ కేసులో ట్విస్ట్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్... ఖండించిన ఎన్సీబీ... విచారణ తప్పించుకునే సాకు!!
ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు : వాట్సాప్
'వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్తో మీరు చేసే చాట్స్ను మూడో వ్యక్తి చూసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు. మీరు,మీరు చాట్ చేసే వ్యక్తి మాత్రమే ఆ మెసేజ్లను చదవగలరు. మధ్యలో మరో వ్యక్తి దూరేందుకు ఏమాత్రం అవకాశం లేదు. ఆఖరికి వాట్సాప్ కూడా ఆ మెసేజ్లను చదవలేదు. యూజర్స్ తమ ఫోన్ నంబర్ను ఉపయోగించి లాగిన్ అవుతారు కాబట్టి.. వారికి సంబంధించిన మెసేజ్ కంటెంట్లో వాట్సాప్ కూడా దూరలేదు.' అని వాట్సాప్ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది.
మూడో వ్యక్తికి యాక్సెస్ ఉండదు...
'నాన్ డివైజ్ స్టోరేజీ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ మాన్యుఫాక్చరర్స్ అందించే మార్గదర్శకాలను వాట్సాప్ ఫాలో అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్స్ అందించే అన్ని రకాల సెక్యూరిటీ ఫీచర్స్ను ఉపయోగించేలా మేము యూజర్స్ను ప్రోత్సహిస్తాం. ఇందులో స్ట్రాంగ్ పాస్వర్డ్,బయోమెట్రిక్ ఐడీ లాంటివి ఉంటాయి. వీటిని ఉపయోగించడం ద్వారా యూజర్ వాట్సాప్ కంటెంట్లోకి మూడో వ్యక్తి దూరే అవకాశం ఉండదు.' అని వాట్సాప్ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఫోరెన్సిక్ పద్దతిలో మాత్రమే...
అయితే గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్లలో స్టోరెజ్ చేసే వాట్సాప్ బ్యాకప్ చాట్స్ను క్లోనింగ్ టెక్నాలజీ ద్వారా మూడో వ్యక్తి చదివే అవకాశం ఉంటుందని చాలామంది భావిస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా టార్గెట్ ఫోన్ సెల్యూలర్ ఐడెంటిటీని మరో ఫోన్లోకి కాపీ చేయగలుగుతారు. ప్రస్తుతం ఇలాంటి యాక్సెస్ కోసం ఓ ప్రత్యేక యాప్ను కూడా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా టార్గెట్ చేసిన ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ స్టేషన్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ను కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అయితే వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడటం అక్రమం. చట్ట ప్రకారం అధికారులు మాత్రమే ఫోరెన్సిక్ పద్దతి ద్వారా సంబంధిత కేసుల్లో ఫోన్ డేటాను యాక్సెస్ చేయగలరు.
Recommended Video
జయ సాహా చాట్స్ లీక్...
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తి టాలెంట్ మేనేజర్ జయ సాహా వాట్సాప్ నుంచి 2017కి సంబంధించిన కొన్ని చాట్స్ లీక్ కావడంతో హీరోయిన్ల పేర్లు బయటపడ్డ సంగతి తెలిసిందే. అయితే జయ సాహా వాట్సాప్ను ఎన్సీబీ ఎలా యాక్సెస్ చేసిందన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీంతో వాట్సాప్ చాట్స్ భద్రతపై కొందరిలో అనుమానాలు మొదలయ్యాయి. చాట్స్లో మూడో వ్యక్తికి యాక్సెస్ ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ దీనిపై వివరణ ఇచ్చుకుంది. అలా జరిగేందుకు అవకాశమే లేదని స్పష్టం చేసింది.