విక్రమ్ ల్యాండర్ అంటూ ఫేక్ ఫొటోలు వైరల్: అసలు అదేంటంటే..?
న్యూఢిల్లీ: ఇప్పుడు దేశ వ్యాప్తంగా చంద్రయాన్-2 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ గురించిన చర్చే జరుగుతోంది. దీంతో సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వార్తలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే, కొందరు ఫేక్ ఫొటోలను షేర్ చేస్తూ ఇదే విక్రమ్ ల్యాండర్ అని ప్రచారం చేస్తున్నారు.
అది నచ్చడం లేదు, అందుకే పెయిడ్ ఆర్టిస్టులతో శిబిరాలు
విక్రమ్ ల్యాండర్ ఆచూకీ..
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే సమయానికి ఇస్రోతో సంబంధం తెగిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆదివారం విక్రమ్ ల్యాండర్ ఆచూకి దొరికిందని ఇస్రో ప్రకటించడంతో చంద్రయాన్-2పై మళ్లీ ఆశలు చిగురించాయి. విక్రమ్ ల్యాండర్తో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నాలు జరుపుతున్నామని తెలిపారు.
ఫేక్ ఫొటోలు వైరల్..
అయితే, ఇస్రో ఛైర్మన్ శివన్.. విక్రమ్ ల్యాండర్ చిత్రాన్ని షేర్ చేశారంటూ కొందరు ఓ చిత్రాన్ని వైరల్ చేశారు. వాస్తవానికి ఇస్రో అలాంటి చిత్రాలను ఏవీ విడుదల చేయలేదు. ప్రస్తుతం విక్రమ్ పేరిట వైరల్గా మారిన చిత్రాలన్నీ అమెరికా ప్రయోగించిన ‘అపోలో 15'కి సంబంధించినవని ఓ ట్వీట్ చేయడంతో అసలు విషయం నెటిజన్లకు తెలిసింది.
ల్యాండర్ ముక్కలవ్వలేదు..
చంద్రుడి ఉపరితలంపై ఉన్న ల్యాండర్కు సంబంధించిన థర్మల్ ఇమేజ్ను మాత్రమే ఆర్బిటర్ తీసిందని, దీని ద్వారా వాస్తవ పరిస్థితి ఎలావుందనేది తెలియరాలేదని ఇస్రో శాస్తవేత్తలు చెప్పారు. ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అయ్యిందని, అది ముక్కలవ్వలేదని శాస్త్రవేత్తలు ఇప్పటికే తెలిపారు. ల్యాండర్తో కాంటాక్ట్ అయ్యేందుకు 14 రోజుల వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని వెల్లడించారు.