జేడీఎస్ ప్రభుత్వానికి ఢోకా లేదు..! ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కర్ణాటక మంత్రి..!!
బెంగళూరు/హైదరాబాద్ : కర్ణాటక ప్రభుత్వం పై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు ఆ రాష్ట్ర మంత్రి. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత ఎంబీ పాటిల్ స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలోకి వెళ్లబోరని పేర్కొన్నారు. 'మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలోకి వెళ్లడం లేదు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వారు (బీజేపీ నేతలు) గతంలో ప్రయత్నించారు. ఇప్పుడూ అదే పనిచేస్తున్నారు. భవిష్యత్తులోనూ ప్రయత్నిస్తారు. మా ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుంది'అని పాటిల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన రమేశ్ జార్కిహోళి, సుధాకర్లు బీజేపీ నేత ఎస్ఎం కృష్ణను ఆయనను నివాసంలో కలిశారు. దీంతో ఒక్కసారిగా కర్ణాటకలో కలకలం మొదలైంది. వారిద్దరూ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాము బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు వచ్చిన వార్తలపై గోకక్ ఎమ్మెల్యే జార్కిహోళి స్పందిస్తూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో అభినందించడానికి వెళ్లానని వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్సభ స్థానాలకు గాను 25 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి రెండు స్థానాల్లో విజయం సాధించింది. కర్ణాటకలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజార్టీ మార్కు 113 కాగా, ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు.