యూపీలో ఓబీసీ పార్టీలతో పొత్తుల్లేవ్-ఎన్డీయే ఘనవిజయం ఖాయం-అమిత్ షా ధీమా
ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. బీజేపీ నుంచి ఓబీసీ నేతల వలసల నేపథ్యంలో స్ధానిక ఓబీసీ గ్రూపులు, పార్టీలు, ఎన్డీయేలో ఉన్న అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారా అన్న ప్రశ్నకు లేదని ఆయన సమాధానమిచ్చారు.
సీఎం యోగీ ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన కేంద్రమంత్రులతో ఇవాళ యూపీలో సమావేశమైన అమిత్ షా... రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో అఖిలేష్ యాదవ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీతో హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాల నేపథ్యంలో అమిత్ షా స్ధానికంగా ఉండి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే స్ధానిక సమీకరణాలు, రిపోర్టుల ఆధారంగా వ్యూహరచన చేస్తున్నారు. యోగీ ఆధ్వర్యంలో యూపీలో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమనే అంచనాలో అమిత్ షా ఉన్నారు.
యూపీలో బీజేపీకి పలు చోట్ల ఎదురుదాలి తప్పదన్న అంచనాల నేపథ్యంలో అమిత్ షా .. ఎన్డీయే మిత్రపక్షాలైన అప్నాదళ్, నిషాద్ పార్టీ నేతలైన అనుప్రియ పటేల్, సంజయ్ నిషాద్ తో చర్చలు జరిపారు. వీరికి ఎన్నిసీట్లు కేటాయించాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం జరగలేదని తెలుస్తోంది. త్వరలో సీట్ల కేటాయింపుపై ప్రకటన ఉంటుందని కేంద్రమంత్రులైన అనుప్రియ పటేల్, సంజయ్ నిషాద్ చెప్తున్నారు. ఈ రెండు పార్టీలతో కలిసి ఎన్డీయే యూపీలో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, అయితే కొన్ని సీట్లు తగ్గొచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. అప్నాదళ్ యూపీలో కీలకమైన కుర్మీ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉండగా.. నిషాద్ పార్టీ.. మత్సకారుల మద్దతుతో కొనసాగుతోంది. వీరిద్దరూ తోడుంటటంతో ఇక మిగతా ఓబీసీ పార్టీలతో పొత్తుకు బీజేపీ సంసిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది.