అమ్మ గది బయట థ్యాంక్స్ చెప్పేవాళ్లం, అంతా శశికళే: జయ వీడియోపై పన్నీరు
చెన్నై: జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి వీడియో అంటూ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన దినకరన్ వర్గం ఇటీవల ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ సీఎం పన్నీరుసెల్వం స్పందించారు. ఆ వీడియోను చిన్నమ్మ వర్గం ఎన్నికలకు ఒక రోజు ముందు విడుదల చేసి లబ్ధి పొందారు.
చదవండి: ఆర్కే నగర్లో దినకరన్ గెలుపు: బీజేపీ వ్యతిరేక ఓటు కాదు!
సోమవారం మాట్లాడిన పన్నీరుసెల్వం నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అమ్మ ఆసుపత్రి పాలైన సమయంలో లోపలకు ఎవరినీ అనుమతించలేదని చెప్పారు. మంత్రులు వెళ్లలేదన్నారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించారని చెప్పారు. శశికళనే పెత్తనం చేసినట్లు చెప్పారు.
చదవండి: దినకరన్ గెలుపు వెనుక: అన్నాడీఎంకేకు 'మోడీ' దెబ్బ: శశికళ వీడియో 'గేమ్', జైలు నుంచే చక్రం
అందుకే మేం గదిలోకి వెళ్లలేకపోయేవాళ్లం
జయను ఇతరులెవరూ ఎందుకు కలుసుకుపోలేకపోయారని విలేకరులు అడగా.. అమ్మ గదికి వెళ్తే ఇన్ఫెక్షన్ సోకుతుందని తమకు చెప్పారని, దాంతో ఆమెకు ఇబ్బంది కలగవద్దనే, అమ్మ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకొని ఊరుకున్నామని పన్నీరుసెల్వం చెప్పారు.
గది బయట థ్యాంక్స్ చెప్పి వచ్చేవాళ్లం
గది బయటకు వచ్చి అమ్మ కోలుకుంటున్నారని, తింటున్నారని తమకు చెప్పేవారని, తాము మాత్రం ఓకే థ్యాంక్స్ అని చెప్పి వెనక్కి వచ్చే వాళ్లమని పన్నీరుసెల్వం వెల్లడించారు. జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలను తాను చూసుకోవాల్సి వచ్చేదని చెప్పారు.
శశికళ ఆనందం
ఇదిలా ఉండగా, ఆర్కే నగర్లో దినకరన్ గెలవడంతో చాలా రోజులకు చిన్నమ్మ శశికళ సంతోషంగా కనిపించారట. జైల్లో ఉన్న ఆమె ఇళవరసితో ఆనందాన్ని పంచుకున్నారు. మరోవైపు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందన్న దినకరన్ వ్యాఖ్యలుతమిళనాట చర్చనీయాంశంగా మారాయి.
స్లీపర్ సెల్ ఎఫెక్ట్
సోమవారం అన్నాడీఎంకే పార్టీ భేటీ అయి నలుగురు దినకరన్ మద్దతుదారులను పదవుల నుంచి తొలగించింది. మరో ఐదుగురిని పార్టీ నుంచి తొలగించింది. స్లీపర్ సెల్స్ ఉన్నారని దినకరన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో జిల్లా యూనిట్ కార్యదర్శులు వెట్రివేల్, పార్దిబన్, రంగసామి, తంగ తమిళ్ సెల్వంలు నలుగురిని దినకరన్ విశ్వసనీయులుగా భావించి పదవుల నుంచి తప్పించారు.