షాక్: శశికళ ఫ్యామిలీ మీద పళనిసామి తిరుగుబాటు: 20 మంది మంత్రులు రివర్స్, మెడపట్టి !
జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీ ముక్కలైన విషయం తెలిసిందే. తాజాగా అన్నాడీఎంకే పార్టీలో పెత్తనం చలాయించడానికి టీటీవీ దినకరన్ ప్రయత్నించడంతో తమిళనాడు సీనియర్ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
చెన్నై: జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీ ముక్కలైన విషయం తెలిసిందే. తాజాగా అన్నాడీఎంకే పార్టీలో పెత్తనం చలాయించడానికి టీటీవీ దినకరన్ ప్రయత్నించడంతో తమిళనాడు సీనియర్ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
బెంగళూరు సెంట్రల్ జైలు చేరుకున్న టీటీవీ దినకరన్: శశికళతో భేటీ, మంత్రుల పని ఫినిష్ !
టీటీవీ దినకరన్, ఆయన కుటుంబ సభ్యులను పార్టీ నుంచి ఎప్పుడో బహిష్కరించామని తమిళనాడు సీనియర్ మంత్రి జయకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి జయకుమార్ వ్యాఖ్యలతో సోమవారం దినకరన్ వెంట ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది యూటర్న్ తీసుకుని ఎడప్పాడి పళనిసామి వర్గంలోకి వచ్చేశారు.
శశికళ, దినకరన్ టార్గెట్ !
అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎరవేశారని అరెస్టు అయిన టీటీవీ దినకరన్ నెల తరువాత బెయిల్ మీద తీహార్ జైలు నుంచి బయటకు వచ్చాడు. వీరిద్దరూ ఇక ముందు పార్టీలో అడుగు పెట్టకుండా చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం టార్గెట్ చేసుకుందని వెలుగు చూసింది.
దినకరన్ తిక్క చేష్టలతో !
తీహార్ జైలు నుంచి విడుదలై నేరుగా చెన్నై చేరుకున్న దినకరన్ తాను అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ కార్యకలాపాలు చూసుకుంటానని, నన్ను ఎవరూ అడ్డుకోలేరని ఓ మీడియా సంస్థకు ఇంటర్వూ ఇచ్చారు. ఇదే సమయంలో మంత్రులు జయకుమార్, సెంగోట్టయన్, తంగవేలు, వేలుమణి తదితరులను తీవ్రస్థాయిలో విమర్శించారు.
మంత్రులకు మండిపోయింది !
దినకరన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన వెంటనే ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించామని మంత్రి జయకుమార్ మీడియాకు చెప్పారు. తరువాత బెయిల్ మీద బయటకు వచ్చిన దినకరన్ పార్టీ పగ్గాలు చేపట్టాలని ప్రయత్నించడంతో పలువురు మంత్రులు మండిపడుతున్నారు.
20 మంది మంత్రులు వ్యతిరేకం !
తమను గురిపెట్టి దినకరన్ మాటల తూటాలు పేల్చడంతో తమిళనాడు ప్రభుత్వంలోని 20 మంది మంత్రులు సీరియస్ అయ్యారు. 20 మంది మంత్రులు ఏకం అయ్యి ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్ చాంబర్ లో గంటకు పైగా సమావేశం అయ్యారు. దినకరన్ వ్యాఖ్యలపై పలువురు మంత్రులు మండిపడ్డారని వెలుగు చూసింది.
పళనిసామి దగ్గరకు పరుగు !
ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్ చాంబర్ లో గంటకు పైగా చర్చలు జరిపిన 20 మంది మంత్రులు నేరుగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి దగ్గరకు వెళ్లారు. సీఎంతో భేటీ అయిన తరువాత మంత్రులు అందరూ మీడియా ముందుకు వచ్చారు.
మెడపట్టి బయటకు పంపించాం !
మీడియాతో మంత్రి జయకుమార్ ఒక్కరే మాట్లాడారు. ఏప్రిల్ 17వ తేదీన దినకరన్, ఆయనకు సంబంధించిన అందరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తూ తాము నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. జయకుమార్ మాట్లాడుతున్న సమయంలో మిగిలిన మంత్రులు అవును అంటూ తలలు ఊపుతూ కనిపించారు.
మళ్లీ వస్తే సహించం !
పార్టీ నుంచి బహిష్కరణకు గురైన దినకరన్ మళ్లీ అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడానికి ప్రయత్నిస్తే తామూ చూస్తూ సహించమని మంత్రి జయకుమార్ అన్నారు. శశికళ, దినకరన్, ఆయన సంబంధికులకు పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని కుండలు బద్దలు కొట్టి చెప్పారు.
పళనిసామి అండతోనే ?
దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సీఎం పళనిసామి చెప్పడం వలనే మంత్రులు అందరూ ఏకం అయ్యారని తెలిసింది. పళనిసామి సైతం దినకరన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని స్పష్టంగా వెలుగు చూసింది.
శశికళకు షాక్ ఇచ్చిన సీఎం !
శశికళ, దినకరన్ ను అన్నాడీఎంకే పార్టీకి దూరం పెట్టాలని పళనిసామి నిర్ణయించారని తెలిసింది. సీనియర్ మంత్రులు, మెజారిటీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చెయ్యడంతో పళనిసామి శశికళ మీద తిరుగుబాటు చెయ్యడానికి సిద్దం అయ్యారని తెలిసింది. సీఎం పళనిసామి తీసుకున్న కఠిన నిర్ణయంతోనే మంత్రి జయకుమార్ టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడారని సమాచారం.