ఎగ్జిట్ పోల్స్పై విశ్వాసం లేదు...కుట్ర జరుగుతోంది: ట్విటర్ వేదికగా మమతా
దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని విశ్లేషించాయి. ఎగ్జిట్ ఫలితాలు బీజేపీకి మొగ్గు చూపడంతో కమలనాథుల్లో ఉత్సాహం కనిపిస్తుండగా... మహాకూటమి, యూపీఏలో మాత్రం నిరుత్సాహం కనిపిస్తోంది.
I don’t trust Exit Poll gossip. The game plan is to manipulate or replace thousands of EVMs through this gossip. I appeal to all Opposition parties to be united, strong and bold. We will fight this battle together
— Mamata Banerjee (@MamataOfficial) May 19, 2019
ఇక సార్వత్రిక ఎన్నికలు 2019లో ఎగ్జిట్ ఫలితాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన స్పందన తెలియజేశారు. ఎగ్జిట్ ఫలితాలు తాను నమ్మనని తెలిపారు. ఎగ్జిట్ ఫలితాల పేరుతో ఈవీఎంలను మానుపులేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. కొన్ని వేల ఈవీఎంలను మార్చే ప్రయత్నం జరుగుతోందనే ఘాటు వ్యాఖ్యలు మమతా బెనర్జీ చేశారు. అన్ని విపక్ష పార్టీలు ఈ ఎగ్జిట్ ఫలితాలు చూసి కంగారు పడొద్దని అందరం కలిసి కట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు మమతా బెనర్జీ. యుద్ధంలో కలిసే పోరాడుదామని ట్విటర్ వేదికగా ఆమె చెప్పారు.
ఇక ఆది నుంచి బీజేపీపై, మోడీ - షా ద్వయంపై మమతా బెనర్జీ ఢీకొడుతూ వచ్చారు. శారదా చిట్ ఫండ్ స్కామ్లో సీబీఐ విచారణకు వస్తే సీబీఐ అధికారులను ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది మమతా బెనర్జీ ఆదేశాల మేరకే జరిగింది. ఆ తర్వాత పలువురు బీజేపీ జాతీయ నాయకులను బెంగాల్లో ప్రచారం నిర్వహించుకోకుండా అనుమతులు శాంతి భద్రత పేరుతో అడ్డుకున్నారు. ఇలా బీజేపీపై గట్టిగా పోరాటం చేసింది దీదీ. ఇదిలా ఉంటే బీజేపీ కూడా అదే స్థాయిలో అక్కడ దీదీని ఢీకొంది. ఇక ఏడు విడతల పోలింగ్లో ఒక్క బెంగాల్లోనే టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.