ప్రీతి జింతా 5 షరతులు అవాస్తవం: వాడియా గ్రూప్
ముంబై: బాలీవుడ్ నటి ప్రీతి జింటా నెస్ వాడియాకు ఐదు షరతులు పెట్టినట్లు వస్తున్న వార్తల్లో వాస్తం లేదని వాడియా గ్రూప్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ మేరకు వాడియా గ్రూప్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్బంగా మే 30వ తేదీన వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ సందర్బంగా తనను లైంగికంగా వేధించడమే కాకుండా... దుర్బాషలాడడంటూ నెస్ వాడియాపై ముంబైలోని మెరైన్ డైవ్ పోలీస్ స్టేషన్లో ప్రీతి జింటా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఆ ఫిర్యాదు అనంతరం ప్రీతి జింటా లండన్ వెళ్లిపోయారు. ఇప్పుడు ఆమె పెట్టిన కేసు గురించి వార్తలు ముంబై మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాడియా గ్రూప్, ప్రీతి జింటా మధ్య రాజీ ఒప్పందం కుదిరిందని, ఈ ఒప్పందంలో ప్రీతి జింటా ఐదు షరతులు విధించారని వార్తలు వచ్చాయి. దీంతో వాడియా గ్రూప్ తమకు ప్రీతి మధ్య చర్చలు జరగలేదని, అలాంటప్పుడు షరతులు, ఒప్పందాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించింది. ఇది ఇలాఉంటే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో వారిద్దరి మధ్య ఎలాంటి వివాదం జరగలేదని నలుగురు సాక్ష్యులు చెప్పినట్టు తెలుస్తోంది.
ప్రీతి జింటాకు వివాదాలు కొత్త కాదు. 'దిల్ సే' సినిమాలో నటిస్తున్న సందర్భంలో షూటింగులో షారుక్ ఖాన్ ను ఏకంగా 'షారూఖ్ ఖాన్, నీవు బ్రహ్మచారివేనా?' అంటూ ప్రశ్నించి సంచలనం సృష్టించింది. 2003లో అండర్ వరల్డ్ మాఫియాపై కోర్టులో ఫిర్యాదు చేసిన జింటా, 2005లో ఓ టీవీ ఛానెల్ సల్మాన్ ఖాన్ గొంతును అనుకరిస్తూ తనపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిందంటూ పరువు నష్టం కేసు వేసి నానా హంగామా చేసింది.
అంతేకాదు 'దర్శకుడు శేఖర్ కపూర్ తో తన వైవాహిక జీవితానికి తెరపడటానికి కారణం ప్రీతి జింటా' అని అతని భార్య సుచిత్రా కృష్ణమూర్తి ఆరోపించినప్పుడు ప్రీతి స్పందిస్తూ, సుచిత్ర మానసిక స్థితి సరిగా లేదంటూ వ్యాఖ్యానించి కొట్టిపారేసింది.