''బూతు సినిమాలు చూసేందుకే అక్కడ ఇంటర్నెట్..''
జమ్మూకశ్మీర్లో గతేడాది ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అక్కడ ఇంటర్నెట్ సేవలను పునరుద్దరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను కేవలం బూతు(పోర్న్) సినిమాలు చూడటానికే వాడుతారని,ఆ సేవలను నిలిపివేసినంత మాత్రాన అంత ప్రభావమేమీ ఉండదని వ్యాఖ్యానించారు. గాంధీనగర్లోని ధీరూభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వార్షికోత్సవంలో భాగంగా వీకె సారస్వత్ మాట్లాడారు.
డర్టీ పిక్చర్స్ కోసమే.. : వీకే సారస్వత్
'కశ్మీర్లో ఇంటర్నెట్ను నిలిపివేయడం ద్వారా వచ్చిన నష్టమేంటి..? అక్కడ ఇంటర్నెట్లో ఏం చూస్తారు..? ఏ రకమైన ఈ-టైలింగ్(ఆన్లైన్ అమ్మకాలు) జరుపుతున్నారు..? కేవలం బూతు సినిమాలు చూడటం తప్ప అంతకన్నా ఏమీ లేదు..' అని వీకే సారస్వత్ వ్యాఖ్యానించారు.
కేంద్రమంత్రుల కశ్మీర్ పర్యటనపై విమర్శలు..
ఇక కశ్మీర్ పర్యటనకు వెళ్లేందుకు సిద్దమవుతున్న కేంద్రమంత్రుల తీరును కూడా సారస్వత్ తప్పు పట్టారు. రాజకీయ నాయకులు అసలు అక్కడికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఢిల్లీ రోడ్లపై ఆందోళనలు జరుగుతున్న తరహాలో కశ్మీర్లోనూ వారు ఆందోళనలను సృష్టించాలనుకుంటున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా దానికి మరింత ఆజ్యం పోస్తుందన్నారు.
అప్పటినుంచి ఇంటర్నెట్ షట్ డౌన్..
గతేడాది అగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసింది. జమ్మూకశ్మీర్ను నుంచి లడఖ్ను వేరు చేసి రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్థానిక రాజకీయ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. ఎటు చూసినా కర్ఫ్యూ వాతావరణమే.
ఇప్పుడిప్పుడే ఇంటర్నెట్ సేవల పునరుద్దరణ..
ఇప్పుడిప్పుడే కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరిస్తున్నారు. జమ్మూకశ్మీర్లో మొబైల్ ప్రీపెయిడ్ సేవలను పునరుద్దరించాలని జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ఈ నెల 18న ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు ఐదు నెలల తర్వాత అక్కడి ప్రజలకు 2జీ మొబైల్ డేటా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. జమ్మూకశ్మీర్లో ఆంక్షలను సమీక్షించాలని జనవరి 10న సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ఈ మేరకు చర్యలు తీసుకుంది.