వీఐపీ కల్చర్కు చెక్ పెడదాం..సంచలన నిర్ణయాలతో వచ్చిన కొత్త నేవీ చీఫ్
నేవీలో అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు కొత్త నేవీ బాస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్. నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ప్రసంగంలోనే వీఐపీ కల్చర్పై మాట్లాడారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఆ డబ్బులను కొన్ని ఈవెంట్ల కోసం పనిచేసే ఆఫీసర్లకు, నేవీలో పనిచేసే ఇతరుల ఖర్చులకు వినియోగిస్తామని అన్నారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న వీఐపీ కల్చర్కు ఫుల్ స్టాప్ పెట్టి అందరూ సాధారణ వ్యక్తుల్లానే మసులుకుందామని సూచించారు. అదే సమయంలో అనవసరపు బడాయిలకు పోరాదని సూచించారు. అంటే ఉన్నతాధికారులు ఇతర వీఐపీలు నేవల్ స్థలాలకు వచ్చిన సమయంలో ఖర్చులు విపరీతంగా పెట్టరాదని కరంబీర్ సింగ్ సూచించారు.
ఇక తాను అన్న మాటలు ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయనే సంకేతాలు పంపారు నేవల్ చీఫ్. కొత్తగా బాధ్యతలు చేపట్టే వారికోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికంగా ఖర్చు చేస్తున్నారనే విషయం గ్రహించిన కొత్త బాస్ ఈ తరహా ఆలోచన చేశారు. అతిథులు వచ్చిన సమయంలో పూల మాలలు, వారిపై పూల వర్షం కురిపించడం,దీపాలను వెలగించడం వంటి ఆర్భాట కార్యక్రమాలకు స్వస్తి పలకాలన్నారు. ఇవన్నీ మతాచారాల కిందకు వస్తాయని ఆయన చెప్పారు.
వీఐపీలు నేవల్ యార్డులను సందర్శించిన సమయంలో ఆఫీసర్ల కుటుంబ సభ్యులు రాకూడదని చెప్పారు.వచ్చేవారికి బొక్కేలు ఇతరత్రా కానుకలు బహూకరించడానికి స్వస్తి పలకాలని కోరారు. ఇక అన్ని ర్యాంకు అధికారులకు ఒకే రకమైన భోజనం, డ్రింక్స్ ఇతరత్రా స్నాక్స్ ఇవ్వాలని ఆదేశించారు. ఇక వీఐపీలు వచ్చిన సమయంలో అంతా అక్కడే ఉండటంతో రోజువారీ కార్యక్రమాలకు కూడా బ్రేక్ పడుతోందని అన్నారు. వీఐపీలు వచ్చిన సమయంలో వారికి స్వాగతం పలికేందుకు ఒక పరిమిత సంఖ్యలో మాత్రమే అధికారులు వెళ్లాలని సూచించారు. అంతేకాదు సెయిలర్లు వీఐపీ కార్ల డోర్లు ఓపెన్ చేయడం వంటి వాటికి గుడ్ బై చెప్పాలని అన్నారు. ప్రతి ఒక్క అధికారిని తమ ర్యాంకులతో సంబోధించాలని జూనియర్ అధికారులు సీనియర్లను గౌరవించాలని అదేసమయంలో వారికి బానిసలుగా పనిచేయరాదని స్పష్టం చేశారు.
ఇక అధికారిక చర్చల్లో చప్పట్లు కొట్టడం కానీ, కేకలు వేయడం కానీ చేయరాదని చెప్పారు. కార్పెట్లు, పూలకుండీలకు స్వస్తి చెప్పాలని ఇవన్నీ అనవసర ఖర్చు కిందికే వస్తాయని అన్నారు. మొత్తానికి కొత్త నేవీ బాస్ తీసుకొస్తున్న ఈ ఆదేశాలు ఎంత వరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.