1988లో మోడీ ఇమెయిల్ వాడారా? ఆ ఛాన్సే లేదే: భారతీయ ఇంటర్నెట్ పితామహుడు
న్యూఢిల్లీ: తాను 1980వ దశకం చివరలో డిజిటల్ కెమెరాను వాడానని, ఇమెయిళ్లను పంపించేవాడినని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యలో ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనంటూ నెటిజన్లు చురకలు అంటించారు. భారత్లో ఇంటర్నెట్ పితామహుడిగా పేరున్న బీకే సైంగల్ కూడా మోడీ చేసిన ప్రకటనలపై అనుమానాలను వ్యక్తం చేశారు. భారతీయులకు ఇంటర్నెట్ను పరిచయం చేసిన పారిశ్రామిక దిగ్గజంగా సైంగల్కు పేరుంది. మోడీ చేసిన వ్యాఖ్యానాలపై ఆయన తొలిసారిగా స్పందించారు.
1987 లేదా 1988 దశకాల్లో ఇంటర్నెట్ను అతి కొద్దిమంది మాత్రమే వినియోగించారని, వారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చని అన్నారు. తనకు తెలిసినంత వరకు మోడీ ఇమెయిల్ను వాడారనడానికి అవకాశం లేదని చెప్పారు. అలాగే- 1987 లేదా 1988లో తాను డిజిటల్ కెమెరాను వినియోగించానని అన్నారు. మనదేశం మొత్తం మీద డిజిటల్ కెమెరాను వినియోగించిన మొట్టమొదటి వ్యక్తిని తానేనని చెప్పారు. తాను డిజిటల్ కెమెరాను కొనుగోలు చేసిన తొలి రోజుల్లో అద్వానీ ర్యాలీకి సంబంధించిన ఫొటోలు తీశానని అన్నారు. వీరమ్గామ్లో లాల్ కృష్ణ అద్వానీ ఓ ర్యాలీని నిర్వహించగా, తన డిజిటల్ కెమెరాతో ఆయనను ఫొటో తీశానని సైంగల్ చెప్పుకొచ్చారు. అప్పట్లో డిజిటల్ కెమెరాలు భారీగా ఉండేవని అన్నారు.
ఆధునిక అమరావతి: కడుపును చీల్చి..గర్భస్థ శిశువును చోరీ చేసి..! అన్నీ ట్విస్టులే!
అద్వానీ ఫొటోను తీసిన తాను ఇమెయిల్ ద్వారా ఢిల్లీకి పంపించానని, ఆ మరుసటి రోజే కలర్లో అది ప్రచురితమైందని గుర్తు చేశారు. కొన్ని గంటల వ్యవధిలో తన ఫొటో కలర్లో రావడాన్ని చూసిన అద్వానీ.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా తనకు ఇప్పటికీ బాగా గుర్తుండి పోయిందని సైంగల్ అన్నారు. అప్పట్లో ఇంటర్నెట్, ఇమెయిల్, డిజిటల్ కెమెరాల వినియోగం చాలా తక్కువ అని చెప్పారు. తన అంచనా మేరకు నరేంద్ర మోడీ ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా- 1988లో ఆయన ఇమెయిల్ను వినియోగించే అవకాశాలు దాదాపు లేవని అన్నారు.
1995కు తరువాత ఇంటర్నెట్ స్థానంలో ఈఆర్నెట్ అందుబాటులో ఉండేదని, ఎంపిక చేసిన వారు మాత్రమే దీన్ని వినియోగించే వారని అన్నారు. ప్రత్యేకించి- పరిశోధకులు, కొన్ని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు మాత్రమే ఈఆర్నెట్ను అందుబాటులో తెచ్చుకున్నారని చెప్పారు. 1980 దశకంలోనే ఇమెయిల్ ద్వారా ఫొటోలను పంపించడానికి ఇంటర్నెట్ను వాడటానికి ఛాన్సే లేదని తేల్చేశారు.
ఎవరీ సైంగిల్?
సైంగల్కు భారత్లో ఇంటర్నెట్ పితామహునిగా పేరుంది. 1991లో ఆయన విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్కు ఛైర్మన్గా నియమితులయ్యారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కత, పుణేల్లో 1995లో వీఎస్ఎన్ఎల్ స్టేషన్లను నెలకొల్పారు. అప్పటి నుంచి క్రమంగా ఇంటర్నెట్ వినియోగం మొదలైనట్లు చెబుతారు. 1995 ఆగస్టు 15వ తేదీన తొలిసారిగా ఇంటర్నెట్ సర్వీసులను వినియోగంలోకి తీసుకొచ్చారు. దీనికోసం ప్రతినెలా అప్పట్లోనే 25, 000 రూపాయల ఛార్జిని వసూలు చేశారు. తొలిదశలో కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పించారు.