మమతా సర్కార్ కు మోడీ మార్క్ షాక్: గణతంత్ర దినోత్సవం వేడుకల్లో.. !
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి అనూహ్యంగా షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తాము తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని, ప్రతి చర్యనూ తప్పు పడుతూ నిప్పులు చెరుగుతోన్న మమతా బెనర్జీ సారథ్యంలోని ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను నిర్ద్వందంగా కొట్టి పడేసింది. ఆ ప్రతిపాదన- గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పశ్చిమ బెంగాల్ శకటానికి సంబంధించినది. ఈ ప్రతిపాదనలను తాము పరిగణనలోకి తీసుకోవట్లేదని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశ రాజధానిలో ఆయా రాష్ట్రాల సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శకటాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకల్లో తమ రాష్ట్ర శకటాన్ని ప్రదర్శించడాన్ని ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటూంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు. ఈ సారి కూడా దీనికి సంబంధించిన మొత్తం 56 ప్రతిపాదనలు రక్షణ మంత్రిత్వ శాఖకు అందాయి.
వాటిని వడపోశారు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు. పశ్చిమ బెంగాల్ ప్రతిపాదనలను తిరస్కరించారు. మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన 22 ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. అలాగే- మరో 32 శకటాలకు సంబంధించిన ప్రతిపాదనలు తమ పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూ కాశ్మీర్, లడక్ ల నుంచి కూడా శకటాలు ఈ సారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దర్శనం ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.
పశ్చిమ బెంగాల్ శకటానికి సంబంధించిన ప్రతిపాదనలను తిరస్కరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దాన్ని నిపుణుల కమిటీకి పంపించే అవకాశం ఉందని తెలిపారు. నిపుణుల కమిటీ ఆమోదిస్తే తప్ప పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ శకటం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కనిపించకపోవచ్చని అంటున్నారు. దీనిపై నిపుణుల కమిటీ ప్రతినిధులు తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.