పార్లమెంటు శీతాకాల సమావేశాల రద్దు- ఈసారి జనవరిలోనే బడ్జెట్ భేటీ
ఈ ఏడాది మార్చిలో మొదలైన కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ముఖ్యంగా శీతాకాలం కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపుతోంది. ఢిల్లీలో కాలుష్యం కారణంగా వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్లో జరగాల్సిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అన్ని పార్టీల సూచన మేరకు ఈ డిసెంబర్లో జరగాల్సిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు చేస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రకటించారు. వచ్చే నెలలో నేరుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం సాగుతున్న రైతుల ఆందోళనల నేపథ్యంలో వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని లోక్సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి రాసిన లేఖకు సమాధానంగా ప్రహ్లాద్ జోషీ స్పందించారు.
ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహిచే విషయంలో అన్ని పార్టీల అభిప్రాయాలు కోరామని, ఇందులో మెజారిటీ అభిప్రాయం ప్రకారం సమావేశాలు రద్దు చేసినట్లు ప్రహ్లాద్ జోషీ ప్రకటించారు. అయితే కాంగ్రెస్ మాత్రం వ్యవసాయ చట్టాల్లో సవరణల కోసం చర్చించేందుకు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే కేంద్రం నిర్ణయం నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల వరకూ కాంగ్రెస్ ఆగాల్సిన పరిస్దితి నెలకొంది.