ఈ గ్రామానికి శాపం ఉందట: మహిళలు బిడ్డకు జన్మనివ్వాలంటే జంకుతారు
మధ్య ప్రదేశ్ : అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ చిన్న గ్రామం. రాజ్గర్ జిల్లాలో ఉంది. అయితే ఆ గ్రామంలోని మహిళలు గత 400 ఏళ్లుగా ఒక బిడ్డకు కూడా జన్మనివ్వలేదు. ఒకవేళ ఆ గ్రామంలో బిడ్డకు జన్మనిస్తే ఆ గ్రామానికి శాపం తగులుతుందని పిల్లలను కనడం మానేశారట. వింతగా ఉంది కదూ. అసలు ఈ కథ కమామిషి ఏమిటో ఓ లుక్కేద్దాం.
మహిళ బిడ్డకు జన్మనిస్తే ప్రాణాలు దక్కవు
మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్ఘర్ జిల్లాలోని సంకశ్యాంజీ గ్రామ ప్రజలు ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముతున్నారు. వారి గ్రామంలో ఎవరైనా మహిళ పిల్లలను కంటే ఆ గ్రామం శాపానికి గురవుతుందని బలంగా నమ్ముతారు . దీంతో 400 ఏళ్లుగా ఆ గ్రామంలో మహిళ బిడ్డకు జన్మ ఇవ్వలేదు. ఒకవేళ నెలలు నిండిన మహిళ బిడ్డను కనాలంటే ఆమె ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా... ఊరు దాటి బిడ్డకు జన్మనివ్వాలే తప్ప ఊర్లో కనకూడదని భీష్మించుకుని కూర్చున్నారు. ఒకవేళ గ్రామంలో బిడ్డను కంటే తల్లీ బిడ్డల్లో ఒకరు మృతి చెందుతారని నమ్ముతారు. లేదా పుట్టబోయే బిడ్డ లోపాలతో పుడుతారని విశ్వసిస్తారు.
గ్రామాన్ని శపించిన దేవుళ్లు
16వ శతాబ్దంలో దేవుళ్లు ఆ గ్రామంలో ఓ ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో ఓ మహిళ గోధుమలను ఇసురురాయిలో వేసి ఇసురుతుండగా దేవుళ్లు చేస్తున్న పూజకు భంగం కలిగిందట. దీంతో కోపోద్రిక్తులైన దేవుళ్లు గ్రామాన్ని శపించారట. ఈ గ్రామంలో ఏ మహిళ కూడా బిడ్డకు జన్మ ఇవ్వలేదని ఒకవేళ ఇస్తే ఇద్దరు మరణిస్తారని శపించారట.
ఊరి బయటే కాన్పులు జరుగుతాయి
దేవుళ్లు గ్రామాన్ని శపించారని గ్రామస్తులు బలంగా నమ్ముతుండటంతో 90 శాతం డెలివరీలు గ్రామం బయట ఉన్న ఆస్పత్రుల్లో జరుగుతాయని... ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో డెలివరీలు గ్రామపొలిమేర్లలో జరుగుతాయని గ్రామ సర్పంచ్ నరేంద్ర గుర్జర్. ఆలయం నిర్మాణంలో ఉండగా మహిళ తన చర్యలతో దేవుళ్ల దృష్టిని మరల్చడంతోనే గ్రామాన్ని శపించారని సర్పంచ్ చెప్పాడు. ఇక అప్పటి నుంచి నేటి వరకు గ్రామంలో మహిళలు పిల్లలకు జన్మనివ్వరని చెప్పారు. ఒకవేళ అత్యవసరం అయితే కేవలం కాన్పులకోసమే ఊరి బయట ఒక గదిని నిర్మించారు గ్రామస్తులు.