శ్రీశ్రీ రవిశంకర్కు నోబెల్ శాంతి బహుమతి?
న్యూఢిల్లీ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారని సమాచారం. కొలంబియాలో శాంతి నెలకొనేందుకు శ్రీశ్రీ చేసిన యత్నాలు సత్పలిస్తుండటంవల్లే ఆయన పేరు నోబెల్ ప్రాబబుల్స్లో ఉన్నట్లు తెలిసింది.
కొలంబియాలో వామపక్ష భావజాలం ఉన్న ఉగ్రవాద సంస్థ ఫార్క్(రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా) నేతలను ప్రభుత్వంతో శాంతి చర్చలకు ఒప్పించడంలో శ్రీశ్రీ పాత్ర కీలకం కావడమే ఈ అవార్డ్ రావడానికి కారణమౌతున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఫార్క్ నేతలు గాంధేయ మార్గంలోకి రావడంలో శ్రీశ్రీ ప్రధాన పాత్ర పోషించారు. దీంతో 1964 నుంచీ హింసాత్మక మార్గంలో ఉన్న ఫార్క్ 2012 నవంబర్ నుంచి శాంతి వచనాలు పలుకుతోంది. ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది.
50 ఏళ్ల హింసలో ఫార్క్ 2 లక్షల మందిని చంపేసింది. 60లక్షల మంది ఫార్క్ బాధితులుగా మారారు. శ్రీశ్రీతో పాటు అమెరికా నిఘా సంస్థ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్, కొలంబియాలో చర్చలు జరుపుతున్న శాంతి దూతల పేర్లు కూడా నోబెల్ రేసులో ఉన్నాయి. వీరికి సంయుక్తంగా బహుమతి ఇచ్చే అవకాశం ఉంది.
శ్రీశ్రీ రవిశంకర్కు ఇటీవలే భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత జులైలో కొలంబియా కూడా తమ దేశంలోని అత్యున్నత పురస్కారం ఆర్డెన్ డె లా డెమొక్రాసియా బొలివార్ అవార్డ్తో శ్రీశ్రీని సత్కరించింది. కాగా, అక్టోబర్లో ప్రకటించే నోబెల్ శాంతి బహుమతుల విజేతల పేర్ల వివరాలు ఫిబ్రవరి ఒకటితో ముగిశాయి. తామ్సన్ రాయ్టర్స్ ఫౌండేషన్ బ్లాగ్ ద్వారా ఈ విషయాలు బహిర్గతమయ్యాయి.