పిఎన్బి స్కాం:'మోడీని కలవలేదు, నీరవ్ మామతో మీ ఫోటోలు', బ్యాంక్ ఉద్యోగికి విలాసవంత విల్లా
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో జరిగిన రూ.11,400 కోట్ల కుంభకోణంలో ఎవర్నీ వదిలి పెట్టేది లేదని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ గురువారం తెలిపారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పీఎన్బీలో దాదాపు రూ.280 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డాడు. మోసపూరిత లావాదేవీలకు పాల్పడిన వారిని ఎవరినీ విడిచి పెట్టేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి తెలిపారు.
Recommended Video
చదవండి: పీఎన్బీ స్కాం: ఇలా బయటపడింది.. కుప్పకూలిన బ్యాంక్ షేరు, ఇక ఇప్పుడేం జరుగుతుంది?
వారి వద్ద నుంచి సొమ్మును రాబడతామన్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు నిరవ్ మోడీ కేసుకు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు జరిపారని చెప్పారు. అక్రమ లావాదేవీలు ఒక బ్రాంచిలోనే జరిగినట్లు వెల్లడించారు. ఇప్పటికే సీబీఐ అధికారులు నిరవ్ మోడ భార్య అమీ మోదీ ఇంటిని సీజ్ చేసినట్లు తెలిపారు. నిరవ్ మోడీ పాస్పోర్టును కూడా రద్దు చేసినట్లు చెప్పారు.
చదవండి: రూ.280 కోట్ల చీటింగ్ కేసు: ప్రముఖ జువెల్లర్ నిరవ్ మోడీపై కేసు
కాంగ్రెస్కు రవిశంకర ప్రసాద్ కౌంటర్
నిరవ్ మోడీ కేసులో కాంగ్రెస్ రాజకీయాలు ఆపాలని కేంద్రమంత్రి రవిశంకరప్రసాద్ అన్నారు. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత సీఈవోలతో మోడీ దిగిన గ్రూప్ ఫోటోను అడ్డం పెట్టుకొని రాజకీయాలు సరికాదన్నారు. ఆ గ్రూప్ ఫోటోలో నిరవ్ మోడీ ఉండటంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. అతనిని చోటా మోడీ అని విమర్శించింది. దీనిపై రవిశంకర ప్రసాద్ మండిపడ్డారు. అసలు చోటా మోడీ పదం ఏమిటని నిలదీశారు.
మా వద్ద నీరవ్ మామతో కాంగ్రెస్ నేతల ఫోటోలు
ఇతరులను ఉద్దేశించి మాట్లాడే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని రవిశంకర ప్రసాద్ తెలిపారు. దావోస్లో మోడీని నీరవ్ మోడీ కలవలేదన్నారు. నీరవ్ సొంతగా దావోస్ వెళ్లాడని చెప్పారు. సీఐఐ ఈవెంట్ లో పాల్గొన్నారని చెప్పారు. కాంగ్రెస్ ఫోటో రాజకీయాలు ఆపేయాలని, నీరవ్ మామతో కలిపి కాంగ్రెస్ నేతలు దిగిన ఫోటోలు తమ వద్ద కూడా ఉన్నాయన్నారు. కానీ వాటిని తాము రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించలేదన్ననారు.
యూపీఏ నిర్వాకాలు బయటపడుతున్నాయి
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వాల నిర్వాకాల ఫలితమే నిరవ్ మోడీ ఉదంతమని మండిపడ్డారు. యూపీఏ నిర్వాకాలు మరిన్ని బయటపడుతున్నాయన్నారు. కాగా, నిరవ్ మోడీ కేసులో ఈడీ వేగంగా చర్యలు చేపడుతోంది. దాదాపు 17 చోట్ల సోదాలు నిర్వహించింది. రూ.5100 కోట్ల విలువైన చరాస్తులను స్వాధీనం చేసుకుంది. నీరవ్ మోడీ సమీప బంధువు చోక్సీకి చెందిన 40 ప్రదేశాలను సీలు చేసింది.
ఓ బ్యాంకు ఉద్యోగి విలాసవంతమైన విల్లా
ఈ బ్యాంకు ఉద్యోగి ఒకరు ముంబైలోని మలాద్లో 2013లో రూ.3.5 కోట్ల అత్యంత విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయనను సస్పెండ్ చేశారు. కుంభకోణం జరిగిన సమయంలోనే ఈ విల్లాను కొనుగోలు చేశాడు. నిరవ్ మోడీ రూ.11,300 కోట్ల స్కాంకు పాల్పడినట్లు పీఎన్బీ ఆరోపించింది. రూ.280 కోట్ల మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ గురువారం నీరవ్ ఆస్తులపై దాడులు నిర్వహించింది.
అప్పటికే ఆలస్యమైంది
మరోవైపు నిరవ్ మోడీ, అతని కుటుంబ సభ్యులు గత జనవరిలోనే దేశం విడిచి వెళ్లిపోయాడు. 2011 నుంచి అతను మోసం చేస్తూ వచ్చాడు. గత నెల మూడో వారంలో మోసాన్ని గుర్తించారు. దీంతో 23వ తేదీన సీబీఐకి ఫిర్యాదు చేసింది. నీరవ్ భార్య అమెరికన్ సిటిజన్ అమీ మోడీ జనవరి 6న, ఆయన సోదరుడు నిశాల్ జనవరి 1న, ఆయన మామ మోహుల్ ఛోక్సి జనవరి 4న భారత్ విడిచి వెళ్లిపోయారు. వారిపై సీబీఐ జనవరి 31న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో పాటు దేశం విడిచి వెళ్లిపోకూడదంటూ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కానీ వారు ముందే వెళ్లిపోయారు.