సీఏఏపై భయం అవసరం లేదు: మోడీతో భేటీ తర్వాత ఉద్ధవ్ ఏమన్నారంటే.?
Recommended Video
న్యఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ) చేపట్టబోమని ప్రధాని నరేంద్ర మోడీ హామి ఇచ్చారని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి..
తన తనయుడు ఆదిత్య థాక్రేతో కలిసి ప్రధాని మోడీని ఉద్ధవ్ థాక్రే శుక్రవారం కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మోడీని కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఇదే తొలిసారి భేటీ కావడం. దేశ వ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లపై ప్రధానితో చర్చించామని ఉద్దవ్ థాక్రే భేటీ అనంతరం వెల్లడించారు.
సీఏఏ గురించి భయపడాల్సిన అవసరం లేదు..
ఇప్పటికే వీటిపై తన వైఖరెంటో చెప్పానని థాక్రే తెలిపారు. సీఏఏ గురించి భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దీని వల్ల మైనార్టీలు లబ్ధిపొందుతారని అన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేయబోమని ప్రధాని మోడీ తమకు హామీ ఇచ్చారని తెలిపారు.
ఎన్పీఆర్ వల్ల ఎవరినీ పంపించడం జరగదు..
అంతేగాక, ఎన్పీఆర్ వల్ల దేశం నుంచి ఎవరినీ పంపించడం జరగదని మహారాష్ట్ర సీఎం వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలోని మహా అఘాడీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటుందని చెప్పారు. తమ పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని వ్యాఖ్యానించారు.
శివసేన ఇలా.. కాంగ్రెస్, ఎన్సీపీలు అలా..
మహారాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని ఉద్ధవ్ థాక్రే తెలిపారు. కాగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని ఉద్ధవ్ థాక్రే కలవనున్నారు. కాగా, కాంగ్రెస్, ఎన్సీపీలు సీఏఏ, ఎన్పీఆర్, ఎన్సీఆర్ లను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. శివసే... సీఏఏను మొదట సమర్థించి, ఆ తర్వాత వ్యతిరేకించి.. మళ్లీ ఇప్పుడు మద్దతు ప్రకటించడం గమనార్హం.