కస్టమర్ల చేతిలో క్యాబ్ డ్రైవర్ హతం -‘జైశ్రీరాం’అనాలంటూ చంపేశారు-ఆడియో వైరల్-పోలీసుల వెర్షన్ వేరు
''బాబూ.. వీళ్లను చూస్తే ఎందుకో అనుమానంగా ఉందిరా.. తేడాగా మాట్లాడుతున్నారు..'' కంగారుగా కొడుక్కి ఫోన్లో ఇంకేదో చెప్పబోయాడా క్యాబ్ డ్రైవర్. అంతలోనే వెనుక సీటు నుంచి మరో వాయిస్.. ''జై శ్రీరామ్ అను.. ఏయ్.. నిన్నే జైశ్రీరామ్ అంటావా, లేదా''.. ఆ తర్వాత కొద్ది సేకన్లకే అంతా బ్లాంక్. క్యాబ్ డ్రైవరైన తన తండ్రి డేంజర్ లో ఉన్నట్లు గుర్తించిన వెంటనే ఆ కొడుకు పోలీసుల్ని ఆశ్రయించాడు. హైవే పెట్రోలింగ్ స్పాట్ కు చేరే సరికే అంతా అయిపోయింది. ఇది ముమ్మాటికీ మత విద్వేష హత్యే అని కుటుంబీకులు ఆరోపిస్తుండగా.. పోలీసులు మాత్రం మత కోణం మచ్చుకైనా లేదని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య
దేశరాజధాని ఢిల్లీని ఆనుకుని ఉండే నోయిడా(ఉత్తరప్రదేశ్)కు చెందిన 45 ఏళ్ల అఫ్తాబ్ ఆలమ్ సొంత క్యాబ్ నడుపుకొంటూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. సీనియర్ డ్రైవర్ కావడంతో రెగ్యులర్ కస్టమర్లు కూడా ఎక్కువే. అలా ఓ కస్టమర్ ను దింపేందుకు సోమవారం మధ్యాహ్నం బులంద్ షహర్(యూపీ) వెళ్లాడు. రాత్రి ఏడు గంటలకు తిరుగు ప్రయాణంలో మరో ఇద్దరు కస్టమర్లను ఎక్కించుకున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో కొడుకుతో ఫోన్లో మాట్లాడిన అఫ్తాబ్.. కాసేపటికే హత్యకు గురయ్యాడు. డ్రైవింగ్ సీటుకే అతణ్ని కట్టేసి, తలపై పలుమార్లు బలంగా కొట్టడంతో రక్తస్త్రావమైంది. రాత్రి 9.30కు క్యాబ్ ను గుర్తించిన పోలీసులు అఫ్తాబ్ ను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ఆడియో వైరల్..
బులంద్ షహర్ నుంచి నోయిడాకు తిరుగు ప్రయాణంలో ఎక్కిన ఇద్దరు కస్టమర్లే డ్రైవర్ అఫ్తాబ్ ను హత్య చేసి ఉంటారని అందరూ భావిస్తున్నారు. చనిపోవడానికి కొద్ది గంట ముందు నుంచి తండ్రితో నిరంతరం ఫోన్లో మాట్లాడానని అఫ్తాబ్ కొడుకు సాబిర్ మీడియాకు తెలిపాడు. ‘‘రాత్రి 7.30కు గంటలకు నాన్న ఫోన్ చేసి, ఫాస్ట్ ట్యాగ్ రీచార్జ్ చేయమన్నాడు. మళ్లీ ఎనిమిది గంటలకు ముందు ఫోన్ చేసి, లోపలున్న కస్టమర్లపై అనుమానం వ్యక్తం చేశాడు. వాళ్లు ‘జైశ్రీరాం' అనాలంటూ బెదిరించడం నాకు స్పష్టంగా వినిపించింది. నాన్న భయపడుతూ మాట్లాడటంతో అనుమానం వచ్చి, ఆ కాల్ మొత్తాన్ని రికార్డ్ చేశాను'' అని సాబిర్ చెప్పుకొచ్చాడు. నోయిడా క్యాబ్ డ్రైవర్ ఆడియో పేరుతో ఆ క్లిప్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఫోన్ కట్ అయిన వెంటనే తాను దాద్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశానని సాబిర్ తెలిపాడు. మత విద్వేషమే తన తండ్రి మరణానికి కారణమని అతను ఆరోపించాడు.
Recommended Video
విద్వేషం కాదు దోపిడీనే..
నోయిడా క్యాబ్ డ్రైవర్ దారుణ హత్యపై పెద్ద ఎత్తున వార్తలు రావడం, ‘జైశ్రీరాం' అనాలంటూ కస్టమర్లు బెదిరించిన ఆడియో వైరల్ కావడంతో నోయిడా రెండో జోన్ ఏసీపీ రాజీవ్ కుమార్ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. క్యాబ్ డ్రైవర్ అఫ్తాబ్ ను హత్య చేసినట్లుగా భావిస్తోన్న ఇద్దరు వ్యక్తులు.. కారును దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో దాడికి దిగారని, బహుశా గతంలోనూ వాళ్లు ఇలాంటి నేరాలకు పాల్పడి ఉండొచ్చని, ఈ ఘటనలో మత కోణం లేనేలేదని ఏసీపీ అన్నారు. ‘‘జైశ్రీరాం అనాలని ఆడియోలు ఉన్న మాట నిజం. కానీ ఆ మాటలు డ్రైవర్ ఆఫ్తాబ్ ను ఉద్దేశించినవి కావు. కారు ఆగి ఉన్న సమయంలో వెనుక కూర్చున్న ఇద్దరు.. మరో మూడో వ్యక్తితో అన్నట్లుగా ఉన్నాయి. ఈ హత్య దోపిడీలో భాగంగా జరిగిందేకానీ, మతవిద్వేషంతో కాదు'' అని ఏసీపీ వివరించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, సమగ్ర దర్యాప్తులో అన్ని నిజాలు బయటికొస్తాయన్నారు.