నోయిడా గ్యాంగ్ రేప్ కేసు: 9మందికి కోర్టు విముక్తి, దర్యాప్తుపై కోర్టు ఆగ్రహం
నోయిడా గ్యాంగ్ రేప్ కేసులో 9 మంది నిందితులకు విముక్తి కలిగించింది. దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ: ఎనిమిదేళ్ల క్రితం ఓ ఎంబిఎ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్రేప్ కేసులో నిందితులను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. దర్యాప్తు లోపభూయిష్టంగా ఉండడం వల్లే రేపిస్టులు తప్పించుకోగలిగారని కోర్టు అభిప్రాయపడింది. నిందితులను గుర్తించేందుకు అవసరమైన జుడీషియల్ టెస్ట్ ఐడింటిఫికేషన్ ప్రక్రియను దర్యాప్తు అధికారి సరైన పద్ధతిలో నిర్వహించలేదని కోర్టు మండిపడింది.
విచారణ అధికారి(ఐఓ), ఇన్స్పెక్టర్ అనిల్ సామానియా విధి నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి షైల్జైన్ వ్యాఖ్యానించారు. ఇన్స్పెక్టర్పై తగినరీతిలో చర్యలు తీసుకోవాలని నొయిడా సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ కేసు విచారణలో ఐఓ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, విచారణ అధికారి కేసును తేలిగ్గా తీసుకున్నారని, దర్యాప్తు అడుగడుగునా లోపభూయిష్టంగా సాగిందని, నిందితులను గుర్తించడం, అరెస్టు విషయంలో ఐఓ పట్టీపట్టనట్టు వ్యవహరించారని జడ్జి స్పష్టం చేశారు.
అయితే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీలం నారంగ్ ఎంతో సమర్ధవంతంగా పనిచేశారని కోర్టు ప్రశంసించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2009 జనవరి 5న గ్యాంగ్రేప్ ఘటన చోటుచేసుకుంది. ఎంబిఏ విద్యార్థిని స్నేహితుడితో కలిసి గ్రేట్ ఇండియా ప్యాలెస్ మాల్ నుంచి తిరిగి వస్తున్నారు. కొందరు యువకులు ఆమె ప్రయాణిస్తున్న కారును ఆపేశారు. ఓ క్రికెట్ మ్యాచ్ నుంచి బైక్లపై వస్తున్న యువకులు బ్యాట్లో దాడిచేశారు.
విద్యార్థిని, ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టి, వెనక సీట్లోకి తోసి నొయిడా శివార్లలోని గరీ చౌఖండి గ్రామంలో నిర్మానుషంగా ఉన్న ప్రాంతానికి కారు తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మొత్తం 11 మంది యువకులు విద్యార్థినిపై సామూహిక అత్యాచారంకి పాల్పడి మొబైల్ ఫోన్లు, రిస్ట్వాచీ,ఏటిఎం కార్డులు ఎత్తుకెళ్లిపోయారు.
బాధితురాలి స్నేహితుడు ఫిర్యాదు మేరకు నోయిడా పోలీసులు కేసు విచారణ చేపట్టారు. పుష్పేందర్ అలియాస్ టుయాన్, శ్రీకాంత్, సంజయ్,గౌతమ్, సుధీర్, లిటిల్,ఓంకార్,పుష్పేందర్,శశికాంత్, గోలు, మరో జువెనల్లను పోలీసులు అరెస్టుచేశారు. నిందితులందరూ బెయిల్మీద బయటకు వచ్చారు. పుష్పేందర్ అలియాస్ టుయాన్ మాత్రం కేసు విచారణలో ఉండగానే మరణించాడు.