భర్త మృతి: 8వ అంతస్తు నుంచి దూకి భార్య ఆత్మహత్య
న్యూఢిల్లీ: భర్త గుండెపోటుతో మరణిస్తే ఆ విషాదాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన నోయిడాలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అనురాగ్ అగర్వాల్(39), మౌనిక (36) దంపతులు నోయిడాలో నివాసముంటున్నారు.
అనురాగ్ అగర్వాల్కు మంగళవారం ఉదయం 11 గంటలకు గుండెపోటు వచ్చింది. వెంటనే మౌనిక భర్తను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అప్పటికే అనురాగ్ అగర్వాల్ మృతి చెందాడని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు.
భర్త మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలోనే ఉంచారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.40 గంటలకు ఇంటికి చేరుకున్న మౌనిక తాను నివాసముంటున్న నోయిడాలోని హౌసింగ్ సొసైటీలో ఉన్న హైరైజ్ ఆపార్ట్మెంట్ 8వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.
రక్తపు మడుగులో పడిఉన్న మౌనికను చూసిన అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అపార్ట్మెంట్ ఓనర్స్ అసోషియేషన్ సంజీవ్ సింగ్కు విషయాన్ని వివరించాడు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న సంజీవ్ సింగ్ పోలీసులకు సమాచారమిచ్చాడు.
దీనిపై డిప్యూటీ సూపరిడెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ సింగ్ మాట్లాడుతూ తన భర్త మరణించడంతో షాక్కు గురైన మౌనిక ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నోయిడాలోని హౌసింగ్ సెక్టార్ 120లో మొత్తం 1,530 ప్లాట్స్ ఉన్నాయి. అందులో ప్రస్తుతం 1,300 మంది కుటుంబాలు నివసిస్తున్నాయి. కొద్ది గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడం అక్కడున్న వారిని కలచివేసింది. ఈ దంపతులకు ఆరేళ్ల పాప ఉంది.
అయితే అనురాగ్ను ఆస్పత్రికి తరలించే సమయంలో కూతురిని తమ పొరుగు వారి ఇంట్లో ఉంచి వెళ్లింది. తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో చిన్నారి అనాథగా మారిపోయింది.