ఆడి కారులో వచ్చి, బీఎండబ్ల్యూ కారు ఎత్తుకెళ్లారు
నోయిడా: దొంగిలించిన ఆడి కారిలో వచ్చిన ఇద్దరు దొంగలు.. బీఎండబ్ల్యూను దోచుకెళ్లిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లోని నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాలోని గేటెడ్ కమ్యూనిటీ సెక్టార్ 17ఏలో గత వారం ఈ దొంగతనం జరిగింది. అయితే, వారు అక్కడున్న సీసీ కెమెరాలకు చిక్కారు.
నోయిడా డీఎస్పీ గౌరవ్ గ్రోవర్ తెలిపిన ప్రకారం.. గేటెడ్ కమ్యూనిటీలో విధులు నిర్వర్తించేందుకు ఉదయాన్నే పని మనుషులు, కార్ డ్రైవర్లు వస్తుంటారు. దీనిని అవకాశంగా తీసుకున్న ఇద్దరు వ్యక్తులు దర్జాగా కొట్టేసిన ఆడి ఏ7 కారులో ఉదయం ప్రవేశించారు.
పని మనుషుల కోసం తెరిచి ఉన్న ఇళ్లలో ప్రవేశించారు. తొలుత నల్ల దుస్తులు ధరించి ఉన్న వ్యక్తి ఏ-11 ఇంట్లోకి వెళ్లి నిమిషాల్లోనే తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఏ 20 ఇంట్లోకి వెళ్లి, ల్యాప్ పట్టుకుని బయటకొచ్చాడు. అక్కడి నుంచి ఏ 22 నివాసం ముందున్న ఫార్చ్యూనర్ కారును బాగా చూసి, ఇంట్లోకి వెళ్లారు.
అనంతరం టేబుల్ పైన ఉన్న తాళాలు తీసుకుని, ఇంటి ముందు పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారును తీసుకుని గేట్ లోంచి దర్జాగా వెళ్లిపోయారు. వారు లోపలకు ప్రవేశించినప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు సిబ్బంది ఎవరూ గుర్తించలేదు. సీసీ కెమెరాల్లో వారి దొంగతనం బయటపడింది.