భారత ఎన్నికల సంఘం చరిత్రలోనే తొలిసారి: నామినేషన్ల దాఖలు ఆన్లైన్ లోనే!
పాట్నా: కరోనా మహమ్మారి దేశంలో అనేక మార్పులను తీసుకొచ్చింది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రత ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. ఇక ఇప్పుడన్నీ ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోంలే సాగుతున్నాయి. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: అదనంగా 3 లక్షల వలస కూలీలు ఓటర్లుగా!
ఆన్లైన్ నామినేషన్ దాఖలుకు అవకాశం
శుక్రవారం ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే, కరోనా కారణంగా ఆన్లైన్ నామినేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది.
భారత ఎన్నికల సంఘం చరిత్రలో తొలిసారి..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్లను దాఖలు చేయవచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది. అంతేగాక, సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించవచ్చని స్పష్టం చేసింది. కాగా, భారత ఎన్నికల సంఘం చరిత్రలో ఆన్లైన్ ద్వారా నామినేషన్లను స్వీకరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇక భౌతికంగా నామినేషన్లు దాఖలు చేస్తే..
ఇక భౌతికంగా నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థి వెంట ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉండాలని, రెండు వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అభ్యర్ధుల ప్రచారం విషయంలోనూ భౌతిక దూరంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈసీ తెలిపింది. కేవలం ఐదుగురిని మాత్రమే ఇంటింటి ప్రచారానికి అనుమతిస్తామని సీఈసీ సునీల్ ఆరోరా పేర్కొన్నారు. ఏడు లక్షల యూనిట్లకు పైగా శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు సీఈసీ తెలిపారు. 46 లక్షల మాస్కులు, ఆరు లక్షలకు పైగా పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
మూడు దశల్లో బీహార్ ఎన్నికలు
బీహార్ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొదటి విడత ఎన్నికలు అక్టోబర్ 28న, రెండో విడత నవంబర్ 3న, మూడో విడత ఎన్నికలు నవంబర్ 7న నిర్వహిస్తారు. నవంబర్ 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి విడతలో 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో 17 జిల్లాల్లోని 94 స్ధానాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. మూడో దశలో 78 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ అరోరా ప్రకటించారు. కరోనా బాధితులకు చివరి రోజు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా సొంత రాష్ట్రానికి చేరుకున్న సుమారు 16 లక్షలకుపైగా వలస కూలీల ఓట్లు కూడా ఇప్పుడు కీలకంగా మారనున్నాయి.