మాజీ ప్రధాని వాజ్ పేయి సర్టిఫికెట్లు మాయం
కాన్పూర్: మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి పీజీ సర్టిఫికెట్లు మాయం కావడంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రా బీమ్ రావ్ అంబేద్కర్ యూనివర్శిటీ (బీఆర్ఏయూ)ను సంప్రదించగా వాజ్ పేయి సర్టిఫికెట్లు చత్రపతి సాహు జీ మహరాజ్ యూనివర్శిటీకి (సీఎస్ జేఎమ్ యూ) పంపించామని చెప్పారు.
డీఏవీ, కాన్పూర్ యూనివర్శిటీ తమ వద్ద వాజ్ పేయి సర్టిఫికేట్లు లేవని చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు తమ నాయకుడు, మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆందోళనకు దిగారు.
ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తమను సంప్రదించారని, వాజ్ పేయి సర్టిఫికేట్లు తమ దగ్గర లేవని తాము చెప్పామని బీఆర్ ఏయూ రిజిస్టార్ బీ.కే. పాండే తెలిపారు. మాజీ ప్రధాని వాజ్ పేయి 1950లో ఆగ్రా యూనివర్శిటీకి చెందిన దయానంద్ ఆంగ్లో-వేదిక్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
అయితే తమ యూనివర్శిటీ 1996లో నెలకొల్పారని సీఎస్ జేఎమ్ యూ వైస్ చాన్స్ లర్ జయంత్ వినాయక్ వైశాంపాయన్ వివరించారు. మాజీ ప్రధాని వాజ్ పేయి సర్టిఫికేట్లు సేకరించి ఇవ్వాలని బీజేపీ కాన్పూర్ అధ్యక్షుడు సురేంద్ర మైధాని ఆగ్రా యూనివర్శిటీ అధికారులకు ఇప్పటికే లేఖలు వ్రాశారు.
వాజ్ పేయి సర్టిఫికేట్లు సేకరించి ఇవ్వకపోతే తాము చత్రపలి సాహు జీ మహరాజ్ యూనివర్శిటీ ముందు ఆందోళన చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. మొత్తం మీద మాజీ ప్రధాని వాజ్ పేయి సర్టిఫికేట్లు మాయం కావడం పెద్ద చర్చకు దారితీసింది.