ఆ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయి... విచారణకు ఆదేశించిన ఉద్ధవ్ సర్కార్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీయేతర నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాపింగ్ కాగా తిరిగి శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకు ట్యాపింగ్లు కొనసాగినట్లు సమాచారం. ఇప్పడు ఈ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.
అమిత్ షాకు స్పాట్ పెట్టిన శరద్ పవార్? జస్టిస్ లోయా మృతి కేసును మళ్లీ తెరుస్తామన్న మహారాష్ట్ర సర్కార్
ఎన్నికల సమయంలో ట్యాపింగ్కు గురైన ఫోన్లు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీయేతర నాయకుల ఫోన్లు ట్యాపింగ్కు గురైయ్యాయని దీనిపై విచారణకు ఆదేశిస్తామని ఆ రాష్ట్ర మంత్రి అనిల్ దేశ్ముఖ్ చెప్పారు. తన ఫోన్ కూడా ట్యాప్ అవుతోందంటూ అంతకుముందు బీజేపీ ప్రభుత్వంలోని ఓ సీనియర్ మంత్రి తనను హెచ్చరించినట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. ఈ మేరకు సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. గత ప్రభుత్వంలో మంత్రి తనను హెచ్చరించగానే తాను సమాధానం చెప్పినట్లు గుర్తుచేశారు సంజయ్ రౌత్. తన ఫోనులో ఏం మాట్లాడుతున్నానో ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చని అందుకు తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. ఎందుకంటే తను బాలాసాహెబ్ థాక్రే శిష్యుడినని సంజయ్ రౌత్ చెప్పారు. ఏదీ రహస్యంగా చేసే అలవాటు తనకు లేదని వెల్లడించారు.
ఉద్దవ్ థాక్రే, శరద్ పవార్ల ఫోన్లు ట్యాప్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీయేతర వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయన్న ఆరోపణలు రాగానే థాక్రే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఎంపీ సంజయ్ రౌత్తో పాటు ఎన్సీపీ నేత శరద్ పవార్ సీఎం ఉద్దవ్ థాక్రేల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురైనట్లు సమాచారం. ఎన్నికల తర్వాత కూడా వీరి ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఆయా పార్టీల నాయకుల మధ్య చర్చలు జరిగిన సమయంలో కూడా ఫోన్లు ట్యాప్ చేసినట్లు సమాచారం. ఆ సమయంలో శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ల మధ్య చర్చలు జరిగాయి.
అప్పటి ఫడ్నవీస్ సర్కార్ పై విచారణకు ఆదేశం
మహారాష్ట్ర హోంశాఖ విభాగం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించినట్లు సమాచారం. దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ పోన్లను ట్యాప్ చేసినట్లు తాము గుర్తించామని అధికార దుర్వినియోగానికి పాల్పడిన అప్పటి ఫడ్నవీస్ సర్కార్పై విచారణకు ఆదేశించామని హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ చెప్పారు. ఇప్పటికే సైబర్ విభాగం అధికారులకు సమాచారం ఇచ్చామని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. అప్పటి విపక్ష నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఫిర్యాదు అందడంతోనే విచారణకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు .
ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ స్టడీ కోసం ఇజ్రాయిల్కు అధికారులు
ఇక ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్లపై స్టడీ చేసేందుకు రాష్ట్ర పోలీస్ శాఖలోని సైబర్ సెల్ అధికారులను ఇజ్రాయిల్ దేశానికి ఫడ్నవీస్ సర్కార్ పంపినట్లు మంత్రి అనిల్ దేశ్ముఖ్ చెప్పారు. అయితే అక్కడికి ఎవరు వెళ్లారు అనేదానిపై విచారణ చేస్తున్నామని, అధికారిక కార్యక్రమం కోసం వెళ్లారా లేక ఫోన్ ట్యాపింగ్ ఎలా చేయాలో స్టడీ చేసేందుకు వెళ్లారా అనేదానిపై ఆరా తీస్తున్నట్లు మంత్రి అనిల్ దేశ్ముఖ్ చెప్పారు.