అలా చేస్తే కాంగ్రెస్ చీలిపోతుంది.. అందుకే ప్రియాంకకు పగ్గాలు అప్పగించండి..
ఢిల్లీ : రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి భర్తీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరిని ప్రెసిడెంట్గా నియమిస్తారన్న దానిపై నేతలు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. గాంధీయేతరులు సైతం కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావచ్చని రాహుల్ గాంధీ గతంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పార్టీ సీనియర్ నేత నట్వర్ సింగ్ తొలిసారి స్పందించారు. గాంధీయేతరులకు పగ్గాలు అప్పగిస్తే 24 గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాహుల్ రాజీనామాతో కాంగ్రెస్ నాయకత్వంపై ఏర్పడిన అనిశ్చితి తొలగాలంటే ప్రియాంక గాంధీకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నట్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు. సోన్ భద్రలో కాల్పుల బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లి ఆమె చూపిన చొరవను ఆయన ప్రశంసించారు. పార్టీని నడిపించగలిగే సామర్థ్యం ఆమెకు ఉందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఈ విషయంలో ప్రియాంక అద్భుతంగా వ్యవహరించారన్న నట్వర్ సింగ్.. ఆమె ఏం కోరుకున్నారో అది సాధించుకున్నారని అన్నారు. గాంధీయేతర వ్యక్తికి పార్టీ పగ్గాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని రాహుల్ మార్చుకోవాలని సూచించారు.
రాహుల్ అభిప్రాయం, ప్రియంక తీసుకునే నిర్ణయంపై ఆమె పార్టీ ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టడం ఆధారపడి ఉంటుందని నట్వర్ సింగ్ చెప్పారు. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది రాహుల్ గాంధీ కుటుంబమే తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అలా కాకుండా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే 24 గంటల్లోనే కాంగ్రెస్ చీలిపోయే అవకాశముందని అన్నారు. 134 ఏళ్ల చరిత్ర గల పార్టీకి అధ్యక్షుడు లేని పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమన్న నట్వర్సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.