ఈవీఎంలు కాదు..వీవీప్యాట్స్ లెక్కించాలి: ఎన్నికల సంఘం పైన విపక్షాల పోరు : నేడు ఢిల్లీలో కీలక భేటీ
ఎన్నికల సంఘం తీరుప పైనా..ఈవీఎంల పైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్న బీజేపీతర పక్షాలు నేడు ఢిల్లీలో భేటీ కానున్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న 21 పార్టీల నేతలంతా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈవీఎంల పైనా ఈ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీవీప్యాట్స్ స్లిప్పులను తొలుత లెక్కించాలనే డిమాండ్తో ఎన్నికల సంఘాన్ని ఈ పార్టీల నేతలు కలవనున్నారు. అదే విధంగా వీవీప్యాట్స్ స్లిప్పులు..ఈవీఎంలో లెక్కలు సమానంగా లేకుంటే మొత్తం లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీయతర పార్టీల సమావేశం..
మరో రెండో రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఎన్డీఏయేతర పక్షాల నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో మొత్తం 21 పార్టీల నేతలు పాల్గొంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగే ఈ సమావేశం ప్రధానంగా ఎన్నికల సంఘం వైఖరిపై నేతలు చర్చించనున్నారు. ఇప్పటికే ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో వీవీప్యాట్స్ స్లిప్పులను ఖచ్చితంగా పూర్తి స్థాయిలో లెక్కించాలని ఈ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా తొలుత వీవీప్యాట్స్ స్లిప్పులను తొలుత లెక్కించాలని..అవి పూర్తయిన తరువాతనే ఈవీఎంలను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికల సంఘం తీరుపైన చర్చ..
ఎన్నికల సంఘం పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించిందని ఈ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో పాటుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇతర నేతలు ఎన్నికల సంఘం పని తీరుపైన ఇప్పటికే పలు ఆరోపణలు చేసారు. బీజేపి కనుసన్నల్లో ఎన్నికల సంఘం పని చేస్తుందంటూ విమర్శలు చేసారు. ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు పైన ఇప్పటికే చంద్రబాబు అన్ని పార్టీల నేతలకు వివరించారు. అదే విధంగా బెంగాల్లో ఒక రోజు ముందుగానే ఎన్నికల ప్రచారం ముగించటం పైనా మమతా ఆగ్రహంతో ఉన్నారు. ఇక, బీజేపి పైనా..ప్రధానంగా ప్రధాని మోదీ పైనా చేసిన ఫిర్యాదుల పైన ఒక్క చర్య కూడా ఎన్నికల సంఘం తీసుకోలేదని..ఇది ఏకపక్షంగా వ్యవహరించటమేనని ఆరోపిస్తున్నారు. ఇక, ఎన్నికల సంఘం లోనే సభ్యుడు డిసెంట్ నోట్ రాయటం పైనా చర్చ చేయనున్నారు.
ఇసితో భేటీ..ధర్నా ఆలోచన..
సమావేశం అనంతరం ఈ 21 పార్టీల నేతలు ఎన్నికల సంఘంతో భేటీ కానున్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టు వీవీప్యాట్స్ స్లిప్పుల విషయంలో ఇచ్చిన ఆదేశాలను అమలు దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకవపోటం పైనా ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ప్రధానంగా కౌంటింగ్ ప్రారంభ సమయంలోనే తొలుత వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని అన్ని పార్టీలు ముక్త కంఠంతో డిమాండ్ చేయాలని నిర్ణయించారు. ముందుగా ఈవీఎంలను లెక్కిస్తే ఏ పార్టీ అభ్యర్ది మెజార్టీలో ఉన్నారో తెలిసి పోతుందని..ఆ తరువాత వీవీప్యాట్స్ స్లిప్పులను లెక్కించినా ఉపయోగం ఉండదని వారి ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు. అయితే, ఎన్నికల సంఘం నుండి వచ్చే స్పందన సరిగ్గా లేకుండా 21 పార్టీల నేతలు కలిసి అక్కడే ధర్నా చేయాలనే ఆలోచన చేస్తున్నారు.