మళ్లీ పెరిగిన నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరలు.. వరుసగా ఐదో నెల..
నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్(14.2కేజీలు) ధరలు వరుసగా ఐదో నెల కూడా పెరిగాయి. ఈ ఎఫెక్ట్తో ఢిల్లీలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర మరో రూ.19, ముంబైలో రూ.19.5 పెరిగినట్టు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెల్లడించింది. జనవరి 1,2020 నుంచి సవరించిన ధరల ప్రకారం ప్రస్తుతం ఢిల్లీలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.714గా ఉంది. ముంబైలో రూ.684.50గా ఉంది. ఇక కోల్కతాలో నాన్ సిబ్సిడీ సిలిండర్ ధర రూ.21.5 పెరిగి ప్రస్తుతం రూ.747గా ఉంది. చెన్నైలో గత డిసెంబర్లో రూ.714గా ఉన్న నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.734కి చేరుకుంది.
మొత్తంగా గత ఏడాది అగస్టు నుంచి ఇప్పటివరకు ఢిల్లీలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.139.5 పెరిగింది. ముంబైలో రూ.138 పెరిగింది. గత డిసెంబర్ నెలలో ఢిల్లీలో 19కేజీల సిలిండర్ ధర కూడా రూ.1241కి పెరిగింది. ముంబైలో రూ.1190కి చేరుకుంది. ప్రస్తుతం ప్రభుత్వం సబ్సిడీపై ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్స్(14.2కేజీలు) అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరల ప్రభావం,విదేశీ మారకం కారణంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ మొత్తం నెల నెలకు మారుతోంది.
చివరిసారిగా గత ఏడాది జులైలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. ఒకేసారి రూ.100.50 తగ్గించడంతో రూ.737.50 ఉన్న సిలిండర్ కాస్త రూ.637 కే లభించింది. అయితే ఆ తర్వాత నెల నుంచే నాన్ సబ్సిడీ సిలిండర్ ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. అగస్టు, 2019నుంచి జనవరి,2020 వరకు ధరలు పెరుగుతూ రావడంతో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర దాదాపు రూ.140 పెరిగింది. పెరిగిన ధరలు సామాన్యులకు మరింత భారమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.