ఐఐటిల్లో మాంసాహారాన్ని నేను ఆపేయలేదు: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: ఐఐటిల్లో మాంసాహారాన్ని తాను ఆపేయించినట్లు వచ్చిన విమర్శలను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. ఆ విధమైన ఆహారాన్ని యుపిఎ ప్రభుత్వ హయాంలోనే ఆపేశారని ఆమె స్పష్టం చేశారు. ఖర్చు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో తాను బాధ్యతలు స్వీకరించడానికి చాలా ముందే మాంసాహారన్ని పెట్టడం ఆపేశారని ఆమె అన్నారు.
ఐఐటిలను తాము శాకాహారం సముదాయాలుగా మార్చామా అని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీ ఐఐటి విద్యార్థులు వివరించారని, నిజానికి అధిక వ్యయంతో కూడిన మాంసాహారం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారని, 2014 ఏప్రిల్లోనే ఆ ఆహారాన్ని ఆపేశారని ఆమె వివరించారు. లోకసభలో ఓ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె గురువారం ఆ వివరణ ఇచ్చారు.
నిజానికి, ఐఐటిలు విద్యార్థులకు మాంసాహారం ఇచ్చే సాధ్యాసాధ్యాలపై మూడు సంస్థలు లేదా వ్యక్తుల ద్వారా పరిశీలన చేయిస్తున్నాయని అన్నారు. ఆ నిర్ణయాల విషయంలో తాను జోక్యం చేసుకోదలుచుకోలేదని అన్నారు. ఐఐటిలు శాకాహారం దిశగా నడుస్తున్నాయని, ఐఐటిలను ప్రోత్సహించాలి గానీ ఐఐటిల్లో ఆహార ప్రోత్సాహం కాదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గౌరవ్ గోగోయ్ అన్నారు.
ఐఐటి ఢిల్లీలో మాంసాహారాన్ని తొలగించడంపై సిపిఎం సభ్యుడు సీతారాం ఏచూరి రాజ్యసభలో తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ భాష స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టడాన్ని స్మృతి ఇరానీ సమర్థించుకున్నారు. విదేశీ భాషలను ప్రత్యామ్నాయాలుగా చదువుకోవాలని ఆమె సూచించారు.
కాషాయధారిని కాబట్టి సంస్కృతాన్ని ప్రోత్సహిస్తాున్నామని తనపై నిందలు వేస్తున్నారని, గాంధీ ఆశించిన జాతీయ విద్యావిధానాన్ని ప్రోత్సహించడానికి తాము ఆ నిర్ణయం తీసుకున్నామని, గాంధీ చెప్పిన త్రిభాషా సూత్రంలో భాగంగానే ఆ పనిచేస్తున్నామని ఆమె అన్నారు. తాము పండిత్ నెహ్రూ, మౌలానా ఆజాద్, రాజీవ్ గాంధీ వారసత్వాన్ని స్వీకరిస్తామని, అదే సమయంలో 900 ఏళ్ల కిందటని భాస్కరాచార్య వారసత్వాన్ని కూడా ఆలింగనం చేసుకుంటామని, సౌకర్యంగా లేనప్పుడు వారసత్వాన్ని వదిలేస్తామని స్మృతి ఇరానీ వివరించారు.