శివరాత్రి: దేవుడికి మాంసం, మద్యం నైవేద్యం, 300 కేజీల చికెన్, సామూహిక భోజనాలు!
బెంగళూరు: భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో శివరాత్రి పండగ భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. శివరాత్రి పండగ రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మరుసటి రోజు ఉదయం శివుడికి ప్రత్యేక పూజలు చేసి నైవేధ్యం పెట్టిన తరువాత భక్తులు ఆహారం తీసుకుంటారు. అయితే కర్ణాటకలోని ఓ గ్రామంలో శివరాత్రి రోజు ఆలయం ఆవరణంలో మాంసంతో వంటలు చేశారు. దేవుడికి మాంసాహారం వంటలు, మద్యం నైవేద్యంగా పెట్టి సామూహిక భోజనాలు చేశారు. 300 కేజీల చికెన్ తో వంటలు చేశారు.
గ్రామం మొత్తం
బెంగళూరు నగర శివార్లలోని రామనగర జిల్లా చెన్నపట్టణ తాలుకా మంగదానహళ్ళి (మంగదానపల్లి)లో హిందువులు శివరాత్రి పండగను భిన్నంగా జరుపుకున్నారు. గ్రామంలోని సిద్దప్పాజీ దేవాలయంలో స్థానికులు శివరాత్రి పండగ రోజు మంగళవారం, మరుసటి రోజు బుధవారం మాంసాహారం వంటలు చేసి సామూహిక భోజనాలు చేశారు.
గొర్రెలు, మేకలు, కోళ్లు
మంగళవారం స్థానికులు గ్రామంలోని ఆలయంలో వందలాధి గొర్రెలు, మేకలు, కోళ్లు బలి ఇచ్చి వాటిని అక్కడే శుభ్రం చేసి మాంసంతో వంటలు చేశారు. తరువాత మాంసం కూరలు, అన్నం, రాగి ముద్ద, మద్యం స్వామికి నైవేధ్యంగా పెట్టారు.
సామూహిక భోజనాలు
స్థానిక గ్రామస్తులు రెండు వేల మందికిపైగా, పరిసర ప్రాంతాల్లోని వెయ్యి మందికి పైగా కలిసి ఆలయం ఆవరణంలో మాంసాహారంతో తయారు చేసన వంటలతో సామూహిక భోజనాలు చేశారు. అనంతరం రాత్రి సామూహిక భజనలు చేశారు.
మేక, 300 కేజీల చికెన్
శివరాత్రి మరుసటి రోజు బుధవారం గ్రామంలోని ఆలయంలో మాంసంతో వంటలు తయారు చేశారు. ఒక మేక, 300 కేజీల చికెన్ తో వంటలు చేసి సామూహిక భోజనాలు చేశారు. ఈ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా ఈ వింత ఆచారం వస్తోంది.
ఒక్కసారి నిలిపేశారు !
కొన్ని సంవత్సరాల క్రితం ఈ వింత ఆచారం నిలిపివేయాలని గ్రామస్తులు తీర్మానించారు. ఒక సంవత్సరం శివరాత్రి రోజు మాంసాహార వంటలు చెయ్యలేదు. ఆ సమయంలో గ్రామంలోని వందాలాధి కోళ్లు వరుసగా దేవాలయం ఆవరణంలోకి వెళ్లి కుర్చున్నాయి. తరువాత మాంసాహారం వంటలు చేసి స్వామికి నైవేధ్యంగా పెట్టి ఆచారాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకూ కొనసాగిస్తున్నారు.
శివరాత్రి మాత్రమే కాదు !
శివరాత్రి పండగ రోజు మాత్రమేకాదు, వరమహాలక్ష్మి వ్రతం, సోమవారం దేవాలయం ఆవరణంలో మాంసాహారంతో వంటలు చేసి స్వామికి నైవేధ్యం పెడుతుంటారు. తమ కోర్కెలు తీర్చాలని స్వామిని ప్రార్థించిన గ్రామస్తులు శివరాత్రి రోజు తమ మొక్కులు చెల్లించుకుంటారని ఆ ఊరి పెద్దలు చెబుతున్నారు.